డీఎస్పీ ఆత్మహత్య కేసు సీబీఐకి: సుప్రీం కోర్టు, కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ, మంత్రికి షాక్!
కర్ణాటక డీఎస్పీ (డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్) ఎంకే. గణపతి మృతి కేసు సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం మద్యాహ్నం సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక డీఎస్పీ (డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్) ఎంకే. గణపతి మృతి కేసు సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం మద్యాహ్నం సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇంత కాలం గణపతి మృతి కేసు సీబీఐకి అప్పగించడానికి నిరాకరిస్తూ వస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి (కాంగ్రెస్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
డీఎస్పీ ఎంకే. గణపతి తండ్రి కుశాలప్ప, సోదరుడు మాచయ్య, సోదరి బబితా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. డీఎస్పీ గణపతి మృతి కేసు సీబీఐకి అప్పగించాలని సుప్రీం కోర్టులో మనవి చేశారు. సుప్రీం కోర్టులో మంగళవారం అర్జీ విచారణకు వచ్చింది.
సుప్రీం కోర్టు ఆదేశాలు
సుప్రీం కోర్టు న్యాయమూర్తి యు. లలిత్, న్యాయమూర్తి గోయల్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ అర్జీ విచారణ చేసి వెంటనే కేసు సీబీఐకి అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి సుప్రీం కోర్టులో నివేదిక సమర్పించాలని సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి, ఐపీఎస్ అధికారుల విచారణ !
కర్ణాటక హోం శాఖ మాజీ మంత్రి, ప్రస్తుతం ఆ రాష్ట్ర నగరాభివృద్ది శాఖ మంత్రి కేజే. జార్జ్, సీనియర్ ఐపీఎస్ అధికారులు ప్రణవ్ మోహంతి, ఏఎం. ప్రసాద్ లను విచారణ చెయ్యాలని సుప్రీం కోర్టు సీబీఐ అధికారులకు సూచించింది.
నా చావుకు హోం మంత్రి, ఐపీఎస్ కారణం
కర్ణాటకలోని మడికేరిలోని లాడ్జ్ లో రూమ్ నెంబర్ 315లో డీఎస్పీ గణపతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోక ముందు డీఎస్పీ గణపతి నా ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా, నేను ఆత్మహత్య చేసుకున్నా హోం మంత్రి కేజే. జార్జ్ (అప్పట్లో), సీనియర్ ఐపీఎస్ అధికారులు ప్రణవ్ మోహంతి, ఏఎం. ప్రసాద్ కారణం అని నేరుగా ఆరోపించారు.
పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
డీఎస్పీ గణపతి చేసిన ఆరోపణలకు వీడియో సాక్షాల ఆదారాలు ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం సీఐడీతో కేసు విచారణ చేయించింది. సీబీఐ విచారణ చేయించాలని గణపతి కుటుంబ సభ్యులు కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేసినా సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.
మంత్రికి క్లీన్ చిట్
బీజేపీ కర్ణాటక శాఖ నాయకులు సైతం గణపతి మృతి కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసినా ఫలితం శూన్యం. సీఐడీ అధికారులు విచారణ చేసి వీడియో సాక్షాలను గాలికి వదిలేసి మంత్రి కేజే. జార్జ్, ఐపీఎస్ అధికారులు ప్రణవ్ మోహంతి, ఏఎం. ప్రసాద్ కు క్లీన్ చిట్ ఇచ్చి కేసు మూసివేశారు.
హైకోర్టు నో చెప్పింది
గణపతి కుటుంబ సభ్యులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తు చేయించాలని మనవి చేసినా అందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గణపతి కుటుంబ సభ్యులు ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతోందని అంటున్నారు.
మంత్రిని కాపాడాలని ?
సీన్సియర్ పోలీసు అధికారి అయిన డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసు విచారణ విషయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కేజే. జార్జ్, ఐపీఎస్ అధికారులను రక్షించడానికి సీఎం సిద్దరామయ్య ప్రయత్నించారని బీజేపీ నాయకులు నేరుగానే ఆరోపణలు చేశారు.