ప్రధాని మోడీపై వ్యాఖ్యలు: ఖర్గే కుమారుడికి ఈసీ నోటీసులు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మరో వారంలో ఎన్నికలు జరగనుండగా.. రాజకీయ పార్టీలన్నీ వాడీవేిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దీంతో విమర్శలు మరింత వేడిపుట్టిస్తున్నాయి. కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.
ప్రధాని నరేంద్ర మోడీ చేతకాని వ్యక్తి అంటూ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినవిగా ఉన్నాయని.. ఈ వ్యాఖ్యలకు గానూ మే 4న సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రియాంక్ని ప్రశ్నించింది.

ఇటీవల ప్రియాంక్ ప్రధాని మోడీ పట్ల అభ్యంతరకరమైన బాషను ప్రయోగించారంటూ బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ నోటీసులు ఇచ్చింది. కాగా, ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
కాగా, అంతకుముందు మల్లిఖార్జున్ ఖర్గే కూడా ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. విమర్శలు రావడంతో ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. ప్రధాని మోడీని ఉద్దేశించి మల్లికార్జున్ ఖర్గే.. "విషపూరిత పాము" అంటూ విమర్శలు చేశారు. అయితే, బీజేపీ నుంచి తీవ్ర విమర్శల మధ్య, ఖర్గే విచారం వ్యక్తం చేస్తూ.. తన వ్యాఖ్యలు పీఎం మోడీ కోసం కాదని, బీజేపీ సిద్ధాంతం "పాము లాంటిది" అని వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్య తర్వాత, సీనియర్ బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ యత్నాల్.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని "విష్కన్య", "పాకిస్తాన్, చైనా ఏజెంట్" అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications