మాజీ సీఎం కేసులు: 15 ఎఫ్ఐఆర్ లు కొట్టివేత
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ఉపాధ్యక్షుడు బీ.ఎస్. యడ్యూరప్ప మీద నమోదు అయిన 15 డినోటిఫికేషన్ కేసులు కొట్టి వేస్తూ కర్ణాటక హై కోర్టు తీర్పు చెప్పింది.
తన మీద నమోదు అయిన కేసులను రద్దు చెయ్యాలని యడ్యూరప్ప కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు. 2015 డిసెంబర్ 16వ తేదిన కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి రత్నకళా అర్జీ విచారణ చేశారు. మంగళవారం 15 ఎఫ్ఐఆర్ లు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆర్ టీఐ కార్యకర్త జయకుమార్ హీరేమఠ్ తన మీద అనవసరంగా కేసులు పెట్టారని, అందులో ఎలాంటి నిజం లేదని, అందు వలన తన మీద నమోదు అయిన కేసుల ఎఫ్ఐఆర్ లు రద్దు చెయ్యాలని యడ్యూరప్ప హై కోర్టును ఆశ్రయించారు.
బెంగళూరు నగరంలోని జేపీ నగర, జయనగర 8వ బ్లాక్, హెచ్ఆర్ బీఆర్ లేఔట్, రాచేనహళ్ళి పరిసర ప్రాంతాల్లోని భూములను అక్రమంగా డినోటిఫికేషన్ చెయ్యడం వలన ప్రభుత్వ ఖజనాకు నష్టం జరిగిందని జయకుమార్ 2013లో హై కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసుల నుంచి బయటపడటంతో యడ్యూరప్ప ఊపిరిపీల్చుకున్నారు.