సిద్దూ పై పరువునష్టం దావా వేస్తా: మాజీ సీఎం సీరియస్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై పరువు నష్టం దావా వేస్తానని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప హెచ్చరించారు. తాను నిర్దోషి అని కోర్టులు తీర్పులిచ్చినా కూడా
మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై పరువు నష్టం దావా వేస్తానని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప హెచ్చరించారు. తాను నిర్దోషి అని కోర్టులు తీర్పులిచ్చినా కూడా సిద్దరామయ్య తనను జైలుకు పోయివచ్చాడని అంటున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా తన మీద కేసులు ఉన్నాయని సిద్దరామయ్య బహిరంగ సమావేశాల్లో పదేపదే ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు, నంజనగూడు నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్ కు మద్దతుగా యడ్యూరప్ప ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్బంగా యడ్యూరప్ప మాట్లాడుతూ తన మీద ఉన్న కేసులను కోర్టులు కొట్టివేశాయని గుర్తు చేశారు. అయితే సిద్దరామయ్య నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ తనను విమర్శిస్తున్నారని మాజీ సీఎం యడ్యూరప్ప మండిపడ్డారు.
దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సిద్దరామయ్య మాత్రమే అని వ్యాఖ్యానించారు. దమ్ముంటే డైరీల కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని యడ్యూరప్ప సవాలు విసిరారు.
సిద్దరామయ్య చేస్తున్న ఆరోపణలకు తాను భయపడనని యడ్యూరప్ప అన్నారు. ఇలాగే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సిద్దరామయ్య మీద పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సిద్దరామయ్య అవినీతి భాగోతం చూడలేకే శ్రీనివాస్ ప్రసాద్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అది సిద్దరామయ్చ చరిత్ర అంటూ యడ్యూరప్ప మండిపడ్డారు.