లోక్ సభలో తీవ్రస్థాయిలో చర్చ, మొబైల్ లో వీడియో గేమ్స్, ఆయన్ను ప్రధానిని చేస్తారా!
బెంగళూరు: లోక్ సభలో వివిధ సమస్యలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంటే మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని వీడియో గేమ్స్ ఆడిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యడానికి ఆ పార్టీ నాయకులు సిద్దం అయ్యారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాహుల్ గాంధీ చెప్పాలి
రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితే మొబైల్ లో వీడియో గేమ్స్ అడినట్లే ప్రజల జీవితాలతో గేమ్స్ ఆడుకుంటాడని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి విమర్శించారు. లోక్ సభలో వివిధ సమస్యలపై చర్చ జరుగుతుంటే వీడియో గేమ్స్ ఆడిన రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని హెచ్ డీ. కుమారస్వామి డిమాండ్ చేశారు.
పాపా పాండు
రాహుల్ గాంధీ భారత ప్రధాని అయ్యే విషయం పక్కనపెడితే ఆయన ఒక పాపా పాండు అని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఎద్దేవ చేశారు. గతంలో జేడీఎస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి హెచ్. విశ్వనాథ్ సైతం రాహుల్ గాంధీని పాపా పాండు అని ఎద్దేవ చేసి తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే.
బతికారా, చచ్చారా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలో చేపట్టిన పిడికెడు ధాన్యం కార్యక్రమంపై హెచ్.డి. కుమారస్వామి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇళ్లకు వెళ్లి పిడికెడు ధాన్యం సేకరిస్తున్న అమిత్ షా ఆ రైతుల కుటుంబ సభ్యులు బతికారా, చచ్చారా అని ఆరా తీస్తున్నట్లు ఉందని హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు.
బీజేపీ కాదు బీఎస్పీ
జేడీఎస్, బీజేపీ లోలోపల ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నిస్తుందని ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని హెచ్.డి. కుమారస్వామి అన్నారు. తాము బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నామని, బీజేపీతో కాదని హెచ్.డి. కుమారస్వామి వివరించారు.
అధికార దాహం
అధికార దాహం కోసం తాము ఎవరితో పడితో వారితో లోలోపల ఒప్పందం చేసుకోమని, ఆ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని మాజీ సీఎం. హెచ్.డి. కుమారస్వామి అన్నారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి 20 సీట్లు కేటాయించామని హెచ్.డి. కుమారస్వామి తెలిపారు.