మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్షం: విచారణ, అరెస్టు చేసుకోండి, పారిపోలేదు!
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు కొన్ని రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి శనివారం సాయంత్రం బెంగళూరులోని సీసీబీ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. తాను ఎక్కడికి పారిపోలేదని, అరెస్టు చేస్తారనే భయం లేదని, కావాలంటే అరెస్టు చేసుకోవాలని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
వెంకటేశ్ ప్రసన్న
తన న్యాయవాది చంద్రశేఖర్ తదితరులను వెంటబెట్టుకుని సీసీబీ కార్యాలయంలో గాలి జనార్దన్ రెడ్డి హాజరైనారు. బెంగళూరు సీసీబీ విభాగం ఏసీపీ వెంకటేశ్ ప్రసన్న నేతృత్వంలోని అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని విచారణ చేస్తున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి అవునా ..కాదా
మీరు గాలి జనార్దన్ రెడ్డి అవునా ? కాదా ? అని ప్రశ్నించిన పోలీసులు ఆయన గుర్తింపు కార్డు (ఐడీ కార్డు), ఫోటో, సంతాకాలు తీసుకున్నారు. అనంతరం వీడియో చిత్రీకరణ, రాతపూర్వకంగా గాలి జనార్దన్ రెడ్డిని విచారణ చేస్తున్న పోలీసులు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకుంటున్నారు.
వీడియో కెమెరాలు
సీసీబీ కార్యాలయంలో ప్రత్యేకంగా వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆండిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి ప్రశ్నలు వెయ్యాలి ? అంటూ సీసీబీ పోలీసు అధికారులు ముందుగానే ఓ జాబితా తయారు చేసుకున్నారని తెలిసింది.
నోటీసులు ఇవ్వలేదు
తనకు పోలీసులు నోటీసులు జారీ చెయ్యలేదని, అవన్ని పుకార్లు అని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు. శనివారం తన న్యాయవాదికి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆదివారం లోపు విచారణకు హాజరుకావాలని సూచించారని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.
అరెస్టు చేసుకోండి!
ఆదివారం ఎందుకు శనివారం పోలీసుల విచారణకు హాజరుకావాలని తాను నిర్ణయించానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. పోలీసులు అరెస్టు చేస్తారని తనకు భయం లేదని, కావాలంటే అరెస్టు చేసుకోవచ్చని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. నోటీసులు ఇవ్వనిదే తాను ఎందుకు విచారణకు హాజరుకావాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు.
ఎందుకు పారిపోవాలి ?
పోలీసుల నుంచి తప్పించుకుని తాను ఎక్కడికి పారిపోలేదని, అంత అవసరం తనకు లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలీఖాన్ సైతం శనివారం సాయంత్రం సీసీబీ పోలీసుల ముందు హాజరైనారు. గాలి జనార్దన్ రెడ్డి విచారణకు హాజరైనారని సమాచారం తెలుసుకున్న సీసీబీ విభాగం జాయిట్ పోలీసు కమీషనర్ అలోక్ కుమార్ సైతం కార్యాలయం చేరుకుని విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.