కన్నడ రాజ్యోత్సవం, మాజీ ఎమ్మెల్యేల బ్లాక్ డే, ఎంఇఎస్ ర్యాలీ, మహారాష్ట్రలో విలీనం!
బెంగళూరు: కన్నడ రాజ్యోత్సవం సందర్బంగా కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కన్నడ రాజ్యోత్సవం నిర్వహించి భువనేశ్వరిమాతకు ప్రత్యేక పూజలు చేసిన కన్నడిగులు కన్నడ జెండాలు ఎగరవేశారు. బెళగావిని మహారాష్ట్రలో విలీనం చెయ్యాలని మాజీ ఎమ్మెల్యేలు బ్లాక్ డే నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
బెళగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఇఎస్) నాయకులు, కార్యకర్తలు కన్నడ రాజ్యోత్సవాన్ని బహిష్కరించి బ్లాక్ డే పాటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం బెళగావిలోని సంభాజీ పార్క్ సమీపంలో ఎంఇఎస్ కార్యకర్తలు గుమికూడారు.
మాజీ ఎమ్మెల్యేలు సంభాజీ పాటిల్, మనోహర్ కిణేకర ఆధ్వర్యంలో ఎంఇఎస్ కార్యకర్తలు సంభాజీ పార్క్ దగ్గర కన్నడ రాజ్యోత్సవంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలు ప్రదర్శిస్తూ బ్లాక్ డే పాటించారు. అనంతరం సంభాజీ పార్క్ నుంచి గోవావేస్ ప్రాంతం వరకు నల్ల జెండాలతో బైక్ ర్యాలి నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంఇఎస్ కార్యకర్తలు నినాదాలు చెయ్యడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యకూడదని పోలీసులు ఎంఇఎస్ కార్యకర్తలను హెచ్చరించారు. మరాఠి ప్రజలు బ్లాక్ డేకి మద్దతు ఇవ్వకపోవడంతో ఎంఇఎస్ నాయకులు షాక్ కు గురైనారు.
ఇదే సందర్బంగా కన్నడ సంఘాలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసు బందోబస్తుతో కన్నడిగులు కన్నడ రాజ్యోత్సవం నిర్వహించారు. అనేక మంది ఎంఇఎస్ మహిళా కార్యకర్తలు నల్ల చీరలు కట్టుకుని ర్యాలి నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
మంగళవారం అర్దరాత్రి కోండసప్పలోని ప్రభుత్వ పాఠశాల మీద నల్లజెండా ఎగరవేసిన అల్లరిమూకలు కన్నడ రాజ్యోత్సవానికి వ్యతిరేకంగా గొడల మీద నినాదాలు రాయడంతో ఉద్రిక్త పరిస్థితి ఎర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా బెళగావిలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.