కర్ణాటకలో కొత్త కాంట్రవర్సీ..!!
Siddaramaiah: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త సమస్యకు తెర తీసింది. చిక్మగళూరు జిల్లాలోని ముడిగెరెలో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ భాషలో ప్రావీణ్యాన్ని తప్పనసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం కొత్త వివాదాన్ని రేకెత్తించింది.
ఇప్పటికే ఈ ఆదేశాలపై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకొంది. కన్నడ భాషను అమితంగా గౌరవించే కర్ణాటకలో భాషాపరమైన వివాదానికి ప్రభుత్వమే కారణం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది సామాజిక స్వరూపాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది.

ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న ముడిగెరె, చిక్మగళూరుల్లో అంగన్వాడీ టీచర్ల కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు ఉర్దూ భాషాలో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు చోట్ల జనాభాలో 31.94 శాతం మేర ముస్లింలు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం- భాషా ప్రాతిపదికన ఉద్యోగాలను కల్పిస్తోందనే వివాదానికి కేంద్రబిందువు అయింది. రాజకీయంగా ఒక సామాజిక వర్గాన్ని బుజ్జగింపు చర్యగా పలువురు వ్యాఖ్యానిస్తోన్నారు. ఈ ఆదేశాలు రాష్ట్ర భాషా సమైక్యతను దెబ్బతీస్తుందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. భాషా ప్రతిపాదికన జనాభాలో చీలిక తెచ్చే ప్రయత్నానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందంటూ బీజేపీ మండిపడుతోంది.
ఈ చర్యను ముస్లిం బుజ్జగింపు చర్యగా అభివర్ణించారు మాజీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్. ఆయనతో పాటు పలువురు బీజేపీ నాయకులు ఈ నిర్ణయం భగ్గుమంటోన్నారు. సొంత రాష్ట్రంలో కన్నడ మాట్లాడే అభ్యర్థులకు మున్ముందు ఉద్యోగ అవకాశాలు దక్కకపోవచ్చంటూ నిప్పులు చెరుగుతున్నారు.
భాషాపరంగా కర్ణాటక రాజకీయాలు అత్యంత సున్నితమైనవిగా చెప్పుకోవచ్చు. హిందీని తప్పనిసరి చేయడాన్ని కన్నడిగులు గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కన్నడ భాషకు ముప్పు వచ్చిన ప్రతీసారీ విస్తృతంగా నిరసనలు తెలియజేస్తూ వచ్చారు.

ఈ పరిణామాల మధ్య ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉర్దూను తప్పనిసరి చేస్తూ ఆదేశాలను జారీ చేయడం, రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ ప్రాబల్యాన్ని దెబ్బతీసే మరో అవాంఛనీయమైన సంఘటనగా పలువురు భావిస్తోన్నారు. కర్ణాటకలో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ- కన్నడను తమ మాతృ భాషగా గౌరవిస్తారు.
ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న జిల్లాల్లో కూడా కన్నడ కంటే ఉర్దూకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఐక్యతను దెబ్బతీస్తుందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. కన్నడిగులకు ఇప్పటికే సొంత రాష్ట్రంలో అనేక ప్రయోజనాలు అందట్లేదనే ఆవేదన ఉంది. అదే సమయంలో ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం భాషాపరమైన అగాథాన్ని మరింత పెంచుతుందని అంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వలస వచ్చే వారి సంఖ్య అధికం. ప్రత్యేకించి- బెంగళూరు, మైసూరు, మంగళూరు వంటి నగరాల్లో వలస వచ్చిన వారి సంఖ్య ఎక్కువ. వారిలో చాలామంది హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ మాట్లాడతారు. ఇది- భాషా వైవిధ్యానికి అద్దం పడుతుంది.
గతంలో హిందీని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించిన కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు నిర్దుష్ట ప్రాంతాల్లో ఉర్దూకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం.. భాషా సాంస్కృతిక సమస్యను మరింత క్లిష్టతరం చేస్తోంది. భాషా వైవిధ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రంలో ఉర్దూకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ప్రమాదకరమైన సంకేతాలను పంపించే అవకాశాలు లేకపోలేదు.
ఉద్యోగం పొందడానికి అన్ని అర్హతలు ఉన్నా గానీ భాషా నైపుణ్యం లేకపోవడం వల్ల చివరికి ఉర్దూ మాట్లాడే అభ్యర్థులను కూడా ఇబ్బందుల్లో నెట్టేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రభుత్వ పథకాలు- లబ్దిదారుల మధ్య వారధులుగా ఉంటారు అంగన్వాడీ వర్కర్లు. ప్రత్యేకించి- గ్రామీణ ప్రాంతాల్లో వారి పాత్ర కీలకం.
గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికులు కన్నడ భాషనే మాట్లాడతారనడంలో సందేహాలు అక్కర్లేదు. ఉర్దూను తప్పనిసరి చేయడం ద్వారా ప్రభుత్వం అంగన్వాడి వర్కర్లు- స్థానికుల మధ్య భాషాపరమైన ఇబ్బందులను సృష్టించే ప్రమాదం ఉంది. గ్రామాల్లో ఉండే చాలా మందికి ఉర్దూ భాష సరిగ్గా అర్థం కాకపోవచ్చు.
మైనారిటీ సామాజిక వర్గీయులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ- అది అధికార యంత్రాంగం, మెజారిటీ ప్రజల ఆంతర్యాన్ని పెంచడానికి కారణమౌతుంది. కన్నడలో ప్రావీణ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
అంగన్వాడీ టీచర్లకు ఉర్దూను తప్పనిసరి చేయాలనే సిద్ధరామయ్య ప్రభుత్వ ఎత్తుగడ.. కర్ణాటకలో అత్యంత సున్నితమైన భాషా, సామాజిక సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇదొక పేలవమైన ఆలోచనా విధానం. కన్నడ కంటే ఒక మైనారిటీ భాషకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ ప్రజలను దూరం చేసుకుంటోంది.
ఈ నిర్ణయం సామాజిక విభజనకు కాకుండా భవిష్యత్ విధానాలకు సైతం ప్రమాదకరంగా పరిణమిస్తుంది. భాషాభిమానం, సాంస్కృతిక వైవిధ్యం వంటి గొప్ప చరిత్ర కలిగిన కర్ణాటకలో సమాజాన్ని భాషా ప్రాతిపదికన విభజించడం కంటే దాన్ని ఏకం చేయాల్సిన విధానాలు అత్యవసరం.












Click it and Unblock the Notifications