హిజాబ్ బ్యాన్ ఎత్తేసిన కర్ణాటక సిద్దరామయ్య ప్రభుత్వం: ఇక స్వేచ్చ
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్పై ఉన్న నిషేధాన్ని తొలగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. ఎవరైనా హిజాబ్ ధరించవచ్చని సీఎం స్పష్టం చేశారు. కర్ణాటక స్టేట్ పోలీస్, మైసూరు జిల్లా పోలీస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్మించిన మూడు పోలీస్ స్టేషన్లను సిద్ధ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హిజాబ్పై ఒకరు ప్రశ్నించగా ఈ మేరకు సీఎం వివరణ ఇచ్చారు.
హిజాబ్ నిషేధం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించా. ఎవరైనా హిజాబ్ ధరించవచ్చు. నేను ధోతీ, జుబ్బా ధరిస్తున్నా. మీలో కొందరు ప్యాంటు, షర్టు ధరించారు. ఇందులో తప్పేం ఉంది? మీరు ఏదైనా తినొచ్చు. ఏదైనా ధరించవచ్చు. ఓట్ల కోసం ఇలాంటి రాజకీయాలు చేయడం తప్పు. వారు సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటుంటారు. కానీ టోపీ, బుర్ఖా ధరించిన వారిని పక్కన పెడతారు. వారి ఉద్దేశం ఏంటి? మా ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుంది అని సిద్దరామయ్య చెప్పుకొచ్చారు.

వస్త్రధారణ అనేది వ్యక్తిగత ఛాయిస్ అని సిద్ధరామయ్య అన్నారు. డిసెంబర్ 23 నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. కాగా, ముఖ్యమంత్రినైన తనతో పాటు అధికారులందరికీ ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వేతనం లభిస్తోందని తెలిపారు. ప్రతి అధికారి ఇది గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజా సేవే అందరికీ ప్రాధాన్యం కావాలని అన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే వారందరికీ గౌరవం ఇవ్వాలని, వారి సమస్యలను ఓపికతో వినాలని స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్లు పీపుల్ ఫ్రెండ్లీగా మారాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసులు ఉంటేనే అక్కడ శాంతియుత జీవనం సాధ్యమవుతుందన్నారు. హింసకు పాల్పడేవారికి కేంద్రాలుగా పోలీస్ స్టేషన్లు మారకూడదన్నారు. అణగారిణ ప్రజలకు న్యాయం చేయాలి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దౌర్జన్యాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. డబ్బు ఉంటేనే న్యాయం జరుగుతుందన్న భావన ఉండకూడదని స్ఫష్టం చేశారు. డబ్బు ఉన్నవారితో, శక్తిమంతులతో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటకాగొద్దు అని సీఎం సిద్ధరామయ్య తేల్చిచెప్పారు.
కాగా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. హిజాబ్ ధరించిన విద్యార్థులను కాలేజీలలోకి అనుమతించలేదు. ఈ వ్యవహారం అప్పట్లో దేశ వ్యాప్త తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం విద్యార్థినులు తీవ్రంగా వ్యతిరేకించారు. పలు ప్రాంతాల్లో నిరసనలు చేశారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అయితే, తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్పై ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications