అర్ధరాత్రి హైకోర్టులో విచారణ: ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలకు ఓకే
బెంగళూరు: ఇవ్వాళ వినాయక చవితి. దేశవ్యాప్తంగా పండగ సంబరాలు మొదలయ్యాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. వినాయకుడి మంటపాలను వీధివీధినా నెలకొల్పుతున్నారు. పండగ సందర్భంగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.
కర్ణాటకలో గణేష్ చతుర్థి వేడుకల నిర్వహణ.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బెంగళూరులోని చామరాజపేట ఈద్గా మైదానంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడించింది. ఈద్గా మైదానంలో ఉత్సవాల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. ప్రత్యామ్నాయ స్థలంలో వేడుకలను నిర్వహించుకోవాలని సూచించింది.
అదే సమయంలో హుబ్లీలోని ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకల నిర్వహణకు హైకోర్టు అంగీకరించింది. ఇదివరకు ధార్వాడ్ మున్సిపల్ కమిషన్ ఇచ్చిన అనుమతులపై స్టే విధించడానికి నిరాకరించింది. బెంగళూరు చామరాజపేట ఈద్గా మైదానం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హుబ్లీ అంశంతో పోల్చి చూడలేమని వ్యాఖ్యానించింది. ధార్వాడ్ మున్సిపల్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తున్నట్లు తెలిపింది.
హుబ్లీ ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించడానికి అనుమతి ఇస్తూ జారీ అయిన ఉత్తర్వులను అంజుమన్ -ఇ-ఇస్లామ్ సవాల్ చేసింది. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మంగళవారం రాత్రి 11:15 నిమిషాలకు కర్ణాటక హైకోర్టు దీనిపై విచారణ చేపట్టింది. న్యాయమూర్తి జస్టిస్ అశోక్ ఎస్ కినగి వాదనలను విన్నారు. హుబ్లీ ఈద్గా మైదానాన్ని ప్రభుత్వం నుంచి 999 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నామని అంజుమన్ తరఫు న్యాయవాది వాదించారు.
బక్రీద్, రంజాన్ వంటి పండగల సమయంలో అక్కడ సామూహిక ప్రార్థనలను నిర్వహిస్తుంటామని, మతపరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటామని అన్నారు. కర్ణాటక ప్రభుత్వ తరఫు న్యాయవాది మాట్లాడుతూ- హుబ్లీ ఈద్గా మైదానం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. సామాజికపరంగా అందరూ ఈ మైదానాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉందని, దానికి అనుగుణంగానే ధార్వాడ మున్సిపల్ కమిషనర్ అనుమతులు ఇచ్చారని అన్నారు.