కర్ణాటక మరో కీలక నిర్ణయం: కరోనా కట్టడికి వీకెండ్ కర్ఫ్యూ ప్రకటించిన సర్కారు
బెంగళూరు: కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులను అరికట్టేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వచ్చే 2 వారాల పాటు కర్ఫ్యూ కొనసాగుతుంది.
థియేటర్లు, మాల్స్, పబ్లు, బార్లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతిస్తామని, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక తెలిపారు. బెంగళూరులోని 10, 12 తరగతులు మినహా జనవరి 6 నుంచి రెండు వారాల పాటు పాఠశాలలు బంద్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, డిసెంబర్ 28 నుంచి పది రోజుల పాటు రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఇటీవల ప్రకటించారు. దేశంలో ఒమైక్రాన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. దీంతో కొంత కాలం పాటు ఆంక్షలు తప్పవని ఆ రాష్ట్ర అధికారులు అంటున్నారు.
ఢిల్లీలోనూ వీకెండ్ కర్ఫ్యూ విధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం గమనార్హం. మంగళవారం(4 జనవరి 2021) ఢిల్లీలో సుమారు 5,500 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఇన్ఫెక్షన్ రేటు 8.37 శాతానికి పెరిగింది. సాయంత్రం 4 గంటలకు ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 5481కొత్త కేసులు నిర్ధారించబడ్డాయి. అదే సమయంలో, 1575 మంది కోలుకోగా.. ముగ్గురు మరణించారు.
ఢిల్లీలో ఇప్పటివరకు 14లక్షల 63వేల 701 మంది రోగులు కరోనా బారిన పడ్డారు. వీరిలో 14లక్షల 23వేల 699 మంది కోలుకున్నారు. 25వేల 113 మంది చనిపోయారు. ప్రస్తుతం 14వేల 889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు.
కాగా, కోవిడ్ కట్టడికి ఢిల్లీ వ్యాప్తంగా 2992 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. కరోనా కేసులు పెరగడంతో వారాంతపు కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ సహా ఎల్లో అలెర్ట్ ఆంక్షలు అమలు చేస్తుంది అక్కడి ఢిల్లీ ప్రభుత్వం. సినిమా హాళ్లు, జిమ్లు మూసివేయబడ్డాయి. నిత్యావసర వస్తువుల దుకాణాలను సరి-బేసి పద్ధతిలో తెరవాలని, మెట్రో, బస్సుల్లో ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతానికి తగ్గించాలని ఆదేశించింది.