ఎమ్మెల్యే ఎన్నికల్లో రాముడు-అల్లాకు పోటీ: బీజేపీ ఎమ్మెల్యే, మంత్రికి కౌంటర్, కేసు!
Recommended Video
బెంగళూరు: కర్ణాటకలో 2018 శాసన సభ ఎన్నికల వేడి అప్పుడే మొదలైయ్యింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా శాసన సభ ఎన్నికల బరిలో అభ్యర్థుల మధ్య పోటీ కాదని, రాముడు- అల్లా మధ్య పోటీ ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇద్దరు దేవుళ్లు పోటీ
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్లాళ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ -బీజేపీల మధ్య పోటీ ఉండదని, రాముడు- అల్లా మధ్య పోటీ ఉంటుందని కార్కాళ శాసన సభ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
10 సభల్లో చెబుతాను !
ఉడిపిలో విలేకరులతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ రాముడు- అల్లా మధ్య శాసన సభ ఎన్నికలు ఉంటాయని తాను ఒక్క సారి కాదు 10 బహిరంగ సభల్లో చెబుతానని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, ఎవ్వరికీ భయపడే ప్రశ్నేలేదని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన మాటలను సమర్థించుకున్నారు.
మంత్రి అల్లా మాత్రమే అంటే ?
తనకు అందరూ కావాలని మంత్రి రామనాథ రై మాట్లాడుంటే తాము ఈ విధంగా మాట్లాడమని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చెప్పారు. అయితే మంత్రి రామనాథ రై తాను అల్లా కృప, దయతోనే గెలిచానని ప్రసగించారని, అందుకే తాను ఇలా మాట్లాడుతున్నామని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
హిందువులకు అవమానం !
తాను ఆరు సార్లు అల్లా దయతో గెలిచానని మాట్లాడిన మంత్రి రామనాథ రై బంట్వాళ నియోజక వర్గంలోని హిందువులను అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. మంత్రి రామనాథ రై వెంటనే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు.
మంత్రికి కౌంటర్
తాను కేవలం అల్లా దయ వలనే ఆరు సార్లు గెలిచి మంత్రిని అయ్యానని మాట్లాడిన మంత్రి రామనాథ రై, ఇప్పుడు హిందువులకు ఏమి సమాధానం చెబుతారు అనే విషయం బయటపెట్టడానికి తాను రాముడు-అల్లా మధ్య ఎన్నికల్లో పోటీ ఉంటుందని చెప్పానని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు.
కేసు నమోదు
రాముడు-అల్లా మధ్య ఎన్నికల్లో పోటీ ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విరుద్దంగా కఠిన చర్యలు తీసుకోవాలని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.