దైవాజ్ఞ: తల్లి తల నరికి, అంత్యక్రియలకు సిద్ధమయ్యాడు
ఓ వ్యక్తి తన తల్లి తలను నరికి దాన్ని అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడ్డాడు. దైవాజ్ఞ మేరకు తాను ఈ పనిచేశానని అతను అంటున్నాడు.
బెంగళూరు: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 35 ఏళ్ల వ్యక్తి తన తల్లి తలను నరికి, దాన్ని అంత్యక్రియలు ఇంట్లోనే చేయడానికి సిద్ధపడ్డాడు. అతన్ని పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మీడియా కథనాల ప్రకారం - తిమ్మప్ప తన 65 ఏళ్ల తల్లితో కలిసి గత పదేళ్లుగా జీవిస్తున్నాడు. రాత్రి భోజనం సమయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో అతను తల్లి తలను నరికాడు. దాన్ని అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యాడు.

ఏదో జరగరానిది జరిగిందనే ఉద్దేశంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపు తట్టారు. అయితే, తలుపులు తీయడానికి తిమ్మప్ప నిరాకరించాడు. తనకు గత రాత్రి దైవుడు కలలో కనిపించి ఆజ్ఞాపించాడని, దాంతో తాను తల్లి తలను నరికానని అతను తలుపులు తీయకుండా చెప్పసాగాడు.
పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అతన్ని అరెస్టు చేశారు. తిమ్మప్ప స్థానికంగా ఓ దుకాణం నడుపుతాడు. రెండేళ్లు కూడా కాపురం చేయకుండానే అతను భార్యనుంచి విడిపోయాడు. దాంతో అతను తీవ్రంగా కలత చెందాడు. తన కడగండ్లకు తల్లే కారణమని అతను కోపం పెంచుకున్నాడు.
దాంతో తరుచుగా తల్లితో గొడవ పడుతుండేవాడు. అతని అన్నయ్య, ఇద్దరు అక్కలు అదే గ్రామంలో ఉంటారు. కానీ వారెవరూ పట్టించుకోలేదు.












Click it and Unblock the Notifications