మేడమ్ తో సెల్ఫీ కోసం ముచ్చటపడిన విద్యార్థి, మంత్రి ఏం చేశారో చూడండి, వైరల్!
బెంగళూరు: కర్ణాటక పవర్ ఫుల్ మంత్రి డీకే శివకుమార్ ఒక సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడిన విద్యార్థి మీద చెయ్యి చేసుకున్నారు. సహనం కోల్పోయి మీడియా ముందే ఆ విద్యార్థిని లాగి కొట్టారు. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ విద్యార్థి మీద చెయ్యి చేసుకుంటున్న వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కర్ణాటకలోని బెళగావిలోని ఓ కాలేజ్ లో పిల్లల హక్కుల విషయంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి డీకే శివకుమార్ హాజరైనారు. కర్ణాటక పిల్లల హక్కుల సంరక్షణా కమిషన్ అధ్యక్షురాలు కృపా అళ్వా కాలేజ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పిల్లల హక్కులు అందరూ కాపాడాలని మంత్రి ప్రసంగించారు.
కార్యక్రమం పూర్తి అయిన తరువాత మంత్రి శివకుమార్ బయలుదేరారు. అదే సమయంలో మీడియా పత్రినిధులు ఎదురు రావడంతో మంత్రి డీకే శివకుమార్ నిలబడి మీడియాతో మాట్లాడటానికి సిద్దం అయ్యారు. పద్మావతి చిత్రం, ప్రముఖ నటి దీపికా పదుకొణెకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తున్నదని మంత్రి డీకే. శివకుమార్ చెబుతున్నారు.
#WATCH Karnataka Min DK Shivkumar hits a man who was taking a selfie during a child rights event at a college in Belgaum (Mobile Video) pic.twitter.com/Sc2jMyK08a
— ANI (@ANI) November 20, 2017
ఆ సందర్బంలో మంత్రి వెనుక పిల్లల హక్కుల సంరక్షణా కమిషన్ అధ్యక్షురాలు కృపా అళ్వా చిరునవ్వుతో కనిపించడంతో ఆమెతో ఓ విద్యార్థి సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడ్డాడు. ఆ సందర్బంలో వెనక్కి తరిగి చూసిన మంత్రి డీకే శివకుమార్ ఒక్క సారిగా విద్యార్థి చేతి మీద బలంగా కొట్టారు.
ఆ సందర్బంలో విద్యార్థి చేతిలో ఉన్న మొబైల్ ఎగిరి దూరంగా పడిపోయింది. ఆ సమయంలో పిల్లల హక్కుల సంరక్షణా కమిషన్ అధ్యక్షురాలు కృపా అళ్వా సైతం ఏమాత్రం స్పంధించలేదు. పిల్లల హక్కుల కోసం ప్రసంగించడానికి వచ్చిన మంత్రి అదే పిల్లల మీద చెయ్యి చేసుకోవడంతో ఆయన తీరుపై పలువురు మండిపడుతున్నారు. మంత్రి డీకే శివకుమార్ కు అంత మాత్రం సహనం లేకపోతే ఏలా అంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు.