కాంట్రాక్టర్ ఆత్మహత్య ఎఫెక్ట్: రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి ఈశ్వరప్ప
బెంగళూరు: కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య నేపథ్యంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వర్ప్ప రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని కలిసి శుక్రవారం రాజీనామా లేఖను అందించనున్నట్లు తెలిపారు. శివమొగ్గలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు.
మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఇటీవల ఆరోపించిన కాంట్రాక్టర్ రెండు రోజుల క్రితం అనుమానాస్పాద స్థితిలో మృతి చెందారు. ఈశ్వరప్ప కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మీడియా సంస్థలకు పాటిల్ సందేశాలు పంపించారు.
ఈ ఘటనపై మంత్రి ఈశ్వరప్ప ఆరోజే స్పందించారు. తనకు ఏమీ తెలియదని అన్నారు. సదరు కాంట్రాక్టర్ తనను కలవలేదన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు పరువునష్టం దావా వేశారు. కాగా, కాంట్రాక్టర్ మృతిపై ఆయన కుటుంబసభ్యులు.. మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు కూడా మంత్రి ఈశ్వరప్ప రాజీనామామా చేయాలని డిమాండ్ చేశాయి. విచారణ అనంతరం మంత్రి ఈశ్వరప్ప రాజీనామాపై నిర్ణయం తీసుకుంటామని సీఎం బొమ్మై స్పష్టం చేశారు. అయితే, ఇంతలోనే ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించడం గమనార్హం.