సిద్దరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి కావాలి: బాంబు పేల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి !
బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మళ్ళీ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి అలియాస్ సుధాకర్ బాంబు పేల్చారు. చిక్కబళ్లాపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధాకర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉలిక్కిపడింది.
మే 23వ తేదీ తరువాత కర్ణాటకతో పాటు దేశంలో రాజకీయ సమీకరణలు మారిపోతాయని సుధాకర్ అన్నారు. ఇలాంటి సమయంలో కర్ణాటకలో అత్యుత్తమ ప్రభుత్వం ఉండవలసిన అవసరం ఉందని సుధాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయితేనే బలమైన ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హెచ్.డి. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసిందని సుధాకర్ గుర్తు చేశారు. సీఎం కుమారస్వామి నాయకత్వంలోనే తాము పని చేస్తున్నామని సుధాకర్ గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను మార్చితే తాము అందుకు మద్దతు ఇస్తామని, కొత్త ముఖ్యమంత్రితో కలిసి తాము పని చేస్తామని సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జేడీఎస్- కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి ఉన్న మాట వాస్తవమే అని సుధాకర్ అన్నారు కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం సక్రమంగా ముందుకు సాగడం లేదని సుధాకర్ చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఓట్లు బీజేపీ పడ్డాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు.