మోడీ బొమ్మతో ఓట్లు పడవ్: అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గ్లామర్ పనిచేయదు: బీజేపీ మాజీ సీఎం
బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కర్ణాటక భారతీయ జనతా పార్టీకి పెద్దదిక్కు. దక్షిణాదిన పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో బీజేపీ బలంగా వేళ్లూనుకుందంటే అది ఆయన చలవే. ఇదివరకు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారాయన. ఇప్పుడు కూడా బీజేపీ అధికారంలో ఉండటానికి యడియూరప్ప చేపట్టిన ఆపరేషన్ కమల ప్రధాన కారణమైంది. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి మరీ.. పార్టీని అందలం ఎక్కించడంలో కీలక పాత్ర పోషించారు.
కుప్పం కోట కుప్ప కూలడం వెనుక ఆ మంత్రి స్కెచ్: ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే..!
కర్ణాటకలో బీజేపీ గ్రామస్థాయిలో బలపడటానికీ యడియూరప్ప కృషి చేశారనడంలో సందేహాలు అక్కర్లేదు. అలాంటి సీనియర్ నాయకుడి నుంచి కొన్ని సంచలన వ్యాఖ్యలు వినిపించడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన తరువాత యడియూరప్ప ఇక పార్టీని బలోపేతంపై దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికలు ఇంకో రెండేళ్లు ఉండగానే ఆ దిశగా పార్టీ క్యాడర్ను ఆయన సమాయాత్తం చేస్తోన్నారు.
రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతోన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎంతమాత్రం కూడా తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. కాంగ్రెస్లో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోన్నారని పేర్కొన్నారు. బూత్ లెవెల్లో యాక్టివ్ మోడ్లో ఉన్నారని చెప్పారు. వారికి ధీటుగా సత్తా చాటాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు చెప్పుకొని అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటే ఫలితం ఉండబోదని కుండబద్దలు కొట్టారు యడియూరప్ప. అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఛరిష్మా పెద్దగా ఉపయోగపడదనీ తేల్చి చెప్పారు. స్థానిక సమస్యలు, స్థానిక నాయకులే పార్టీ విజయంలో కీలక పాత్ర పోషిస్తారని పునరుద్ఘాటించారు. అందుకే బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త కూడా చురుగ్గా వ్యవహరించాలని, స్థానిక నాయకత్వాన్ని విశ్వసించాలని సూచించారు.
లోక్సభ ఎన్నికల్లో మాత్రం మోడీ గ్లామర్ పని చేస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఉప ఎన్నికలు బీజేపీకి నల్లేరు మీద నడక కాబోదని హెచ్చరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలుస్తుందని, నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని యడియూరప్ప జోస్యం చెప్పారు. మైసూరు జిల్లాలో దేవాలయాల కూల్చివేతపై ప్రభుత్వం ప్రజానుకూల, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని సూచించారు.
Recommended Video
ఈ విషయంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జనతాదళ్కు చెందిన పలువురు నాయకులు, కొందరు సిట్టింగ్ శాసన సభ్యులు.. తనతో సంప్రదింపులు జరుపుతున్నారని, వారంతా బీజేపీలో చేరడానికి అనుకూలంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ గ్రామస్థాయిలో బలపేతంగా ఉందని, దీన్ని మరింత పటిష్ట పర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రజానుకూల నిర్ణయాలను తీసుకోవడం, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్లే అది సాధ్యపడుతుందని యడియూరప్ప వ్యాఖ్యానించారు.