అక్కా, బావతో గొడవ: ఇంటికి నిప్పు, ముగ్గురు సజీవదహనం, పోలీసుల కాల్పుల్లో యువకుడు !
బెంగళూరు: అక్కా, బావ మీద గొడవపడి కోపంతో వారి ఇంటికి నిప్పంటించడంతో ముగ్గురు సజీవదహనం అయ్యారు. ముగ్గురు సజీవదహనం కావడానికి కారణం అయిన యువకుడి మీద కర్ణాటకలోని కలబురగి పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని చాకచక్యంగా మళ్లీ పట్టుకున్నారు.
కర్ణాటకలోని కలబురగి పట్టణంలోని ఎంఎస్. మిల్ ఇక్బాల్ కాలనీలో మహమ్మద్ ముస్తాఫా అనే యువకుడి అక్కా, బావ నివాసం ఉంటున్నారు. మహమ్మద్ ముస్తాఫా అక్కా, బావతో గొడవ పెట్టుకున్నాడు. వారి మీద ఉన్న కోపంతో ఈనెల 4వ తేదీన వారి ఇంటి బయట తలుపుకు తాళం వేశాడు.

మహమ్మద్ ముస్తాఫా అక్క ఇంటి మీద కిరోసిన్, పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనాడు. మంటలు వ్యాపించడంతో ఇంటిలోని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మహమ్మద్ ముస్తాఫా హైదరాబాద్ పారిపోయాడు. విషయం తెలుసుకున్న కలబురగి యూనివర్శిటీ పోలీసులు హైదరాబాద్ వెళ్లారు.
జులై 10వ తేదీ హైదరాబాద్ లో మహమ్మద్ ముస్తాఫాను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించిన పోలీసుల మీద అతను దాడి చేసి తప్పించుకున్నాడు. జులై 11వ తేదీ హైదరాబాద్ శివార్లలో మహమ్మద్ ముస్తాఫాను పోలీసులు అరెస్టు చేసి కలబురగి తీసుకువచ్చారు.
మహమ్మద్ ముస్తాఫా ఇంటిలో మారణాయుధాలు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి గురువారం ఉదయం బయలుదేరారు. మార్గం మధ్యలో కలబురగిలోని సేడం రోడ్డులోని బుధ్ద విహార్ ప్రాంతంలో ఏఎస్ఐ, ఇద్దరు పోలీసుల మీద మహమ్మద్ ముస్తాఫా కత్తితో దాడి చేశాడు.
పోలీసుల మీద దాడి చేసిన మహమ్మద్ ముస్తాఫా కాళ్ల మీద పోలీసులు కాల్పులు జరిపి పట్టుకున్నారు. నిందితుడి చేతిలో గాయాలైన పోలీసులు సదర్ పటేల్, శివలింగ, సలీంను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మహమ్మద్ ముస్తాఫాను కలబురగి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎన్. శివకుమార్ ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications