పోలీసు శాఖలో ఉద్యోగాలు: రూ. 18 కోట్లు స్వాహా, నగదు పంపిణిలో తేడా, ఐపీఎస్ తో సహ!
బెంగళూరు: పోలీసు శాఖ, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు రూ. 18 కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారితో సహ ఐదు మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
కర్ణాటక పోలీసు శాఖ రిక్రూట్మెంట్ (పోలీసు నియామకాల బోర్డు) చీఫ్ కేపి. రాజేష్, ముగ్గురు డీజీపీలకు పీఏగా పని చేస్తున్న హెచ్. నాగరాజు, కానిస్టేబుల్స్ లక్ష్మికాంత, షబానా బేగం, లోకేష్ అనే ఐదు మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.
కానిస్టేబుల్స్ లక్ష్మికాంత, షబానా బేగం, లోకేష్ అనేక మంది నిరుద్యోగులకు పొలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సీనియర్ ఐపీఎస్ అధికారి రాజేష్, నాగరాజుకు పరిచయం చేశారు. అనంతరం నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో వీరు నగదు వసూలు చేశారు.
ఎస్ఐ, ఎస్ డీఐ, ఎఫ్ డీఐ, డీఎస్పీ ఉద్యోగాలతో పాటు పోలీసు శాఖలో అనేక ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పారు. 2013 నుంచి 2017 వరకు దాదాపు రూ. 18 కోట్లకు పైగా నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేసుకున్నారు.
ఇటీవల కానిస్టేబుల్స్ లక్ష్మికాంత, లోకేష్ మధ్య నగదు పంచుకునే విషయంలో తేడాలు వచ్చాయి. ఈ విషయంపై పగ పెంచుకున్న లక్ష్మికాంత బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కార్యాలయానికి వెళ్లి విషయం చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ దెబ్బతో అందర్నీ అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ దందాలో మరికొంత మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారని బెంగళూరు సీసీబీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.