నో డౌట్..కీలకం సిద్దరామయ్యే!: కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్ పార్టీకి కీలకం
బెంగళూరు: మరో మూడు నెలల్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా చూసిన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి విభిన్నమైనవే. రెండు నెలల క్రితం గుజరాత్, అంతకుముందు ఐదు నెలల ముందు ఉత్తరప్రదేశ్లతో పోలిస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీఎం సిద్దరామయ్య సారథ్యం వహిస్తుండటం సానుకూల పరిణామం. ఇంతకుముందు జరిగిన ఉత్తరప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించే స్థానిక నాయకులే లేరు. ప్రత్యేకించి గత నెలలో ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రచార చాతుర్యం, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పకడ్బందీ ప్రచార వ్యూహం ప్లస్ మీడియా వ్యతిరేక ప్రచారానికి దీటుగా కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వ 'గుజరాత్ మోడల్' ప్లస్ జీఎస్టీ, నోట్ల రద్దు తదితర అంశాలపై దూకుడుగా ప్రచారం చేశారు.
తద్వారా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ మాత్రమే ఇవ్వగలిగింది. కాకపోతే హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవానీ, అల్పేశ్ ఠాకూర్, చోటు వాసవ వంటి యువ నేత వంటి సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీకి ఒకింత అండగా నిలిచాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాసలయ్యాయి.
కర్ణాటకలో గెలుపుపైనే కాంగ్రెస్, బీజేపీలకు కీలక ఆశలు
వచ్చే నాలుగు నెలల్లో కర్ణాటకతోపాటు నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలకు, ఈ ఏడాది చివరిలో మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. అయితే ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయల్లోని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం వెంటాడుతున్నది. మేఘాలయలో మాజీ డిప్యూటీ సీఎం తదితర నేతలంతా లోక్సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా తనయుడు కన్రడ్ ఏ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)లో చేరిపోతున్నారు. త్రిపురలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా నామమాత్రవశిష్టమైంది. త్రిపురలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం నామమాత్రమే. ఇక రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మిజోరంలో కాంగ్రెస్ పార్టీ మూడోదఫా అధికారం కోసం ప్రయత్నిస్తున్నా.. పార్టీ నాయకత్వం అంతర్గత సమస్యలనెదుర్కొంటున్నది.
మధ్యప్రదేశ్ లో రెండు గ్రూపులుగా కాంగ్రెస్
ఇక రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మధ్య టాస్ దోబూచులాట ఆడుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మూడు గ్రూపులు, ఆరు ముఠాలుగా విడిపోయింది. ప్రత్యేకించి ఒక గ్రూపునకు మాధవరావు సింధియా తనయుడు జ్యోతిరాదిత్య సింధియా, మరో గ్రూపునకు మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ప్లస్ కేంద్ర మాజీ మంత్రి కమల్ నాథ్ పోటీ పడుతున్నారు.
బీజేపీలో శక్తిమంతమైన నేతలకు కొదవలేదు
ఇక గిరిజనులు అత్యధికంగా రాష్ట్రం ఛత్తీస్గఢ్లో మూడోసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమణ్సింగ్ను ఢీకొట్టే సామర్థ్యం గల నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కాగడా పెట్టి వెతికినా అందుబాటులో లేరు. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీకి ఎక్కడికక్కడ సమర్థవంతమైన, శక్తిమంతమైన వ్యూహాలు, గట్టి నాయకులు కలిగి ఉన్నారు. ఈ రాష్ట్రాలన్నింటితో పోలిస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీది భిన్నమైన పరిస్థితి. సీఎం సిద్దరామయ్య అధికార పార్టీకి నాయకత్వం వహిస్తున్న స్థానిక నేత.
బీజేపీని తిప్పికొట్టే సామర్థ్యం సిద్దూకు పుష్కలమే
అయితే కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఒక విమర్శ ఉంది. నిత్యం సమావేశాల్లో నిద్ర పోతారని నిత్యం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. సుదీర్ఘంగా నిద్ర పోయినా ప్రతిదీ తన చేతుల మీదుగానే సాగాలని భావిస్తారు. అయితే దీనికి అదనంగా బీజేపీ హిందుత్వ దాడి ఉండనే ఉంది. విమర్శల మాటెలా ఉన్నా బీజేపీ చేసే ఆరోపణలను దీటుగా తిప్పికొట్టగల సామర్థ్యం కూడా సిద్దరామయ్యకు పుష్కలంగానే ఉన్నాయి. దీనికి ఇటీవల బీజేపీ, ఆరెస్సెస్లను ఆయన ఉగ్రవాద సంస్థలతో పోల్చడమే నిదర్శనం.
యెడ్యూరప్ప చరిస్మా ముందు సిద్దూకు ఇక్కట్లే
సిద్దరామయ్య ఒక ప్రజా నాయకుడు కాదు.. జననేత అంతకన్నా కాదు. కేవలం ఏడెనిమిది శాతం మంది జనాభా గల కురుబా సామాజిక వర్గంలోనే మాత్రమే ఆయనకు మద్దతు లభిస్తున్నది. గత ఐదేళ్ల కాలంలో ఆయన పనితీరు, ఇతర అంశాలను పోల్చుకుంటే ఆయన తన సామాజిక వర్గం మద్దతు పొందడమూ కష్టమేనన్న అభిప్రాయం ఉన్నది. ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే చరిస్మా గల నాయకుడిగా పేరొందారు.
హిందుత్వపై కాంగ్రెస్ పార్టీ ఇలా మెతకవైఖరి
ఎన్నికలు దగ్గర పడినా కొద్దీ అకస్మాత్గా బీజేపీపై, హిందుత్వపై ఆయన విమర్శలు చేయడం సాధారణమవుతాయి. తనకు తాను స్థానికుడినని, ప్రత్యక్ష దాడి చేయగల సామర్థ్యం, నేర్పు ఆయన సొంతం. కొన్ని సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై వ్యక్తిగత దాడులు చేయడానికి వెనుకంజ వేయరు. అయితే ఉగ్రవాదులు అన్న వ్యాఖ్య చేసినందుకు సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీ అది నాయకత్వం, ప్రత్యేకించి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుబట్టినట్లు వార్తలొచ్చాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వపై బీజేపీ నేతలు రెచ్చగొట్టినా రాహుల్ గాంధీ గానీ, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ తొణకలేదూ బెణకలేదు.
సిద్దూ సారథ్యంలోనే బీజేపీకి కర్ణాటకలో గట్టి సవాల్
ఒకవేళ ఎన్నికలు జరిగితే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీల జోడీని ఎదుర్కొనే సత్తా సీఎం సిద్దరామయ్యకే ఉన్నదని, ఆయన, ఆయన మద్దతుదారులు చెబుతారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తర్వాత తమ అధినేతే నిలుస్తారని అంటారు. సిద్ద రామయ్య రాజకీయ నేతగా ఆయనకు గల పరిమితులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు.ప్రధాన ప్రతిపక్ష బీజేపీతో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తే అందుకు సిద్దరామయ్య నాయకత్వమే శరణ్యం అంటే అతిశయోక్తి కాదు.
క్యాబినెట్ పునర్య్వవస్థీకరణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇలా
12 ఏళ్ల క్రితం వరకు మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ (సెక్యలర్) పార్టీ నేతల్లో ఒకరు సిద్దరామయ్య. 12 ఏళ్ల క్రితం జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇటీవలి వరకూ ఆయనను ‘హస్తం' పార్టీ నేతలు బయటి వ్యక్తిగానే భావించారు. కానీ క్రమంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సారథి స్థాయికి సిద్దరామయ్య ఎదిగారు. సిద్దరామయ్య 2016లో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు పార్టీలో అసమ్మతి హోరెత్తింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సిద్దరామయ్య నాయకత్వం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో పార్టీ నేతలందరికీ నచ్చజెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చింది. అంతటితో ఆగక గతేడాది ఏప్రిల్ నెలలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపించడంతో నాటకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థాయిని పెంచింది.
అమరీందర్ సింగ్ మాదిరే కీలక భూమిక పోషిస్తున్న సిద్దూ
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సిద్దరామయ్య తిరుగులేని నాయకుడు మాత్రమే కాదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ముఖ్య నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దరామయ్య నిర్ణయాలకే ‘ఎన్నికల సమరాన్ని' వదిలేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నది. ఒకవైపు అమరిందర్ సింగ్ను పక్కకు తప్పించాలని రాహుల్గాంధీ ప్రయత్నించినా గతేడాది ఫిబ్రవరిలో ఒంటిచేత్తో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. సిద్దరామయ్య మాదిరిగానే పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి అండదండలనిచ్చిన నేత అమరీందర్ సింగ్.
ఇలా సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం
సిద్దరామయ్య ప్రజాదరణ గల నాయకుడు.. ఆయన ప్రవృత్తే ప్రజాదరణ తెచ్చి పెట్టింది. 2013 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించే వరకు సాధారణ నేతగా ఉన్నారు. సీఎంగా బాద్యతలు చేపట్టిన తర్వాత కొన్ని పథకాల అమలు, ఉచితంగా విద్యుత్ సరఫరా వంటి అంశాలు మాత్రమే విజయావకాశాలను నిర్దేశించవు. నిరుపేదలకు బియ్యం, పాలు పంపిణీ, మైనారిటీ మహిళలకు నగదు సాయం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ కంప్యూటర్లు వంటి పథకాలు సిద్దరామయ్యకు పేరు తెచ్చి పెట్టాయి.
హిందీకి వ్యతిరేకంగా ఇలా ‘కన్నడ’ ఆత్మగౌరవ నినాదం
అంతేకాదు బెంగళూరు నగర పరిధిలో తొలుత ‘ఇందిర క్యాంటిన్ల' పేరిట రాయితీపై ఆహార క్యాంటిన్లు ప్రారంభించారు. తర్వాతీ దశలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిరుపేదలకు ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మితవాద సంస్థల స్వరాన్ని తిప్పి కొట్టేందుకు ‘కన్నడ' ఆత్మగౌరవాన్ని భావోద్వేగ భరితం చేసేందుకు ప్రయత్నించారు. ప్రత్యేకించి జాతీయ స్థాయిలో హిందీ భాషను ప్రాచుర్యంలోకి తేవాలని చేసిన ప్రయత్నాలు ‘కన్నడి'గుల ఆత్మ గౌరవానికి దెబ్బ అన్న ప్రచారాన్ని రేకెత్తించారు. కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక పతకాన్ని ప్రతిపాదించారు.
గెలుపునకు కుల సమీకరణాలపైనే సిద్దరామయ్య ఆధారపడాలి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరహాలో ప్రధాని నరేంద్రమోదీ, హిందుత్వ రాజకీయాలను దీటుగా తిప్పికొట్టడంలో సిద్దరామయ్య సిద్ద హస్తుడు. అంతే కాదు సిద్దరామయ్య తనపై గల హిందుత్వ వ్యతిరేక ముద్రను తొలిగించుకుని రాహుల్ మాదిరిగా ఉదారవాద ద్రుక్పథం కనబర్చడంలో ముందు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కర్ణాటకలోనూ విజయం సాధించాలంటే సిద్దరామయ్య పూర్తిగా కుల సమీకరణాలపైనే ఆధార పడి ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్ణాటకలో కుల సమీకరణాలకు అనుగుణంగా విజయం సాధించిన పరిస్థితులు లేవు. కాకపోతే కర్ణాటకలో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగల సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయన్నది వాస్తవం అంటే అతిశయోక్తి కాదు.