ADR Report : కర్నాటక పోరులో కోటీశ్వరుల హవా-సగం మంది వారే-సగటు ఆస్తి రూ.12 కోట్లపైమాటే..
కర్నాటకలో మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ తో పాటు మరో విపక్ష పార్టీ జేడీఎస్ కూడా గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్నాయి. ఈ ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బు కూడా చేతులు మారుతోంది. అంతే కాదు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు కూడా కోట్లు వెదజల్లే పరిస్ధితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా అభ్యర్ధులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లు పరిశీలిస్తే కర్నాటకలో ఏం జరగబోతోందో ఇట్టే అర్ధమవుతోంది.
కర్నాటక ఎన్నికల్లో అభ్యర్ధులపై తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)సంచలన నివేదిక ఇచ్చింది. ఇందులో రాష్ట్రంలో పోటీ చేస్తున్న అసెంబ్లీ అభ్యర్ధుల ఆస్తులు ఏ స్ధాయిలో ఉన్నాయో వెల్లడించింది. దీని ప్రకారం ఈసారి పోటీ చేస్తున్న వారిలో సగం మంది కోటీశ్వరులే ఉన్నారని వెల్లడించింది. వీరంతా బలవంతులే కాదు ఆర్ధికంగా కోటీశ్వరులని కూడా తేల్చింది. దీంతో ఈ అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2586 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా.. వీరిలో దాదాపు సగం మంది అంటే 1087 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ వెల్లడించింది. శాతాల్లో చూసుకుంటే కోటీశ్వరులైన అభ్యర్ధులు 42 శాతం పోటీలో ఉన్నారని తేలింది. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ కోటీశ్వరుల సగటు ఆస్తులు 12.26 కోట్లుగా తేలింది. 2018 ఎన్నికల్లో ఇది కేవలం 7.5 కోట్లుగా ఉండటం విశేషం. అంటే ఈ ఐదేళ్లలో సగటున ఐదు కోట్ల మేర వీరి ఆస్తులు పెరిగాయి.
ఈసారి కర్నాటక పోరులో పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్ధుల్లో 97 శాతం మంది కోటీశ్వరులు ఉండగా.. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వారిలో 96 శాతం మంది ఉన్నారు. అలాగే జేడీఎస్ తరఫున పోటీ చేస్తున్న వారిలో 82 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 592 మంది అభ్యర్ధులు తమకు 5 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. అలాగే 272 మంది అభ్యర్ధులు తమకు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకూ ఉన్నట్లు వెల్లడించాలని ఏడీఆర్ తెలిపింది.
ఇక ఆస్తుల జాబితాలో కాంగ్రెస్ నేత కేజీఎఫ్ బాబు (యూసుఫ్ షరీఫ్) రూ.1633 కోట్లతో టాప్ లో ఉన్నారు. ఆ తర్వాత కర్నాటక మంత్రి నాగరాజు రూ.1609 కోట్లతో రెండో స్దానంలో ఉన్నారు. ఆ తర్వాత పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్ రూ.1413 కోట్లతో మూడో స్ధానంలో ఉన్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రియాకృష్ణ రూ.1156 కోట్లతో ఐదో స్ధానంలో, మరో కాంగ్రెస్ నేత బీఎస్ సురేష్ రూ.648 కోట్లతో తర్వాతి స్ధానంలో ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ తెలిపింది.












Click it and Unblock the Notifications