ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన పట్ల కర్ణాటక అభ్యంతరం: జగన్కు లేఖ..!
బెంగళూరు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యాబోధనను కొనసాగించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తోన్న ప్రయత్నాల పట్ల కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఇంగ్లీషులో విద్యాబోధన కొనసాగించే పరిస్థితుల్లో కన్నడ భాష మనుగడ ఉనికి ప్రశ్నార్థకమౌతుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వైఎస్ జగన్కు లేఖ రాశారు.
నిర్భయ దోషి క్యురేటివ్ పిటీషన్ కొట్టివేత: స్టే దరఖాస్తునూ తోసిపుచ్చిన సుప్రీం.. !
కర్ణాటక-ఏపీ సరిహద్దు జిల్లాల్లో..
కర్ణాటక అభ్యంతరాన్ని వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. కర్ణాటకకు ఆనుకుని ఉన్న అనంతపురం, చిత్తూరు, కర్నూలు వంటి సరిహద్దు జిల్లాల గ్రామాల్లో కన్నడంలో విద్యాబోధన కొనసాగించే ప్రభుత్వ పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఉపాధి అవకాశాలను వెదుక్కుంటూ కర్ణాటక నుంచి ఆయా జిల్లాల సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లో స్థిరపడ్డారు. వారితోపాటు- ముందు నుంచీ ఏపీ సరిహద్దు గ్రామాల్లో స్థిరపడిన కన్నడిగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి వెసలుబాటు కోసం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో కన్నడ భాషలో విద్యను బోధిస్తున్నారు.
కన్నడలో బోధన కొనసాగించండి..
ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లీషులో విద్యాబోధన కొనసాగించడం వీలుగా బదలాయించడం వల్ల కన్నడ భాష కనుమరుగవుతుందని సురేష్ కుమార్ చెబుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటున్న తమ విద్యార్థులు ఇబ్బందులు పడతారంటూ లేఖలో పేర్కొన్నారు. కన్నడను తప్పనిసరి బోధనా మాధ్యమంగా మార్చడంతో పాటు సంబంధిత పాఠశాలలను కొనసాగించడానికి చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
కన్నడ ఉపాధ్యాయుల ఉపాధి మాటేంటీ?
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కన్నడ భాషలో విద్యను బోధించే ఉపాధ్యాయులకు ఉద్యోగాలకు భరోసా ఉండదని సురేష్ కుమార్ అన్నారు. అలాగే- ఇన్ని రోజుల పాటు కన్నడ భాషకు అలవాటు పడిన తమ రాష్ట్ర విద్యార్థులు మాతృభాషకు దూరం అవుతారని చెప్పారు. మైనారిటీ భాషా ప్రభుత్వ పాఠశాలలను కొనసాగించడానికి అనువుగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన వైఎస్ జగన్కు విజ్ఙప్తి చేశారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యాబోధనను ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరంభించనున్న విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఐఎఎస్ అధికారిణి వెట్రి సెల్వికి ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆరంభం కానున్న ఈ విధానం పట్ల ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. తెలుగు భాషాభిమానులు కూడా దీన్ని తప్పు పడుతున్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.