కర్నాటక ఎఫెక్ట్ : కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన మమతా బెనర్జీ.. ఆ షరతుతో..
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన సంచలన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీతో పోరాడుతూ, కాంగ్రెస్ తో కలిసేందుకు ఆలోచిస్తున్న భావసారూప్య పక్షాలకు ఊపునిచ్చింది. ముఖ్యంగా కర్నాటకలో కాంగ్రెస్ తరహాలోనే గతంలో పశ్చిమబెంగాల్ లో బీజేపీతో హోరాహోరీ పోరాడి గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజా ఫలితాలతో తన రూటు మార్చుకుంటోంది.ఈ మేరకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు.
కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధమని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ సంచలన ప్రకటన చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఎన్నోసార్లు అవకాశం వచ్చినా దూరంగా ఉంటూ వస్తున్న మమత.. ఈసారి మాత్రం కర్నాటక ఫలితాలతో రూటుమార్చింది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధమని మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. దీంతో మమత ప్రకటన కాంగ్రెస్ పార్టీని సంతోషంలో నింపింది.

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీకి తాము మద్దతిచ్చేందుకు సిద్ధమేనని ప్రకటించిన మమత.. అదే సమయంలో ఓ కండిషన్ కూడా పెట్టారు. తాము బలంగా ఉన్న బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ తమతో పోరాడకుండా మద్దతివ్వాలని కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పాటు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రకటన సహజంగానే కాంగ్రెస్ పార్టీకి వరంగా మారబోతోంది. ఎందుకంటే ఇన్నాళ్లూ జాతీయ స్దాయితో పాటు రాష్ట్రాల్లోనూ తమకు మద్దతిచ్చేందుకు వెనుకాడుతున్న మమత, కేజ్రివాల్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీల విషయంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది.
కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మా మద్దతు తీసుకుని, తిరిగి బెంగాల్ లో మాతో పోరాటం చేస్తానంటే కుదరదంటూ మమతా బెనర్జీ తన కండిషన్ ను స్పష్టంగానే చెప్పేశారు. మీరు ఏదైనా మంచిని సాధించాలనుకుంటే, మీరు కొన్నింటిని త్యాగం చేయాల్సి ఉంటుందంటూ మమత కాంగ్రెస్ కు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications