బెంగళూరులో కుంభవృష్టి: విమానాశ్రయంలో పోటెత్తిన వరద: ట్రాక్టర్లపై ప్రయాణికులు
బెంగళూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. కర్ణాటకపై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు స్థాయి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీని తీవ్రత మరింత ఉధృతమైంది. బెంగళూరు సహా పొరుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి- ఉద్యాననగరిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం ఆరంభమైన వర్షం కొన్ని గంటల పాటు కుండపోతగా దంచి కొట్టింది. ఫలితంగా- లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఎల్లో అలర్ట్..
బెంగళూరులో కొన్ని గంటల వ్యవధిలో 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బెంగళూరు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవ్వాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మరోసారి రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కావడానికి అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బెంగళూరు, బెంగళూరు రూరల్, రామనగర, చిక్బళ్లాపుర, కోలార్, తుమకూరు జిల్లాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
విమానాశ్రయంలో వరద నీరు..
సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ కొన్ని గంటల పాటు బెంగళూరు, బెంగళూరు రూరల్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బెంగళూరు దక్షిణ ప్రాంతం శివార్లలోని భాగలూరు, చిక్కజాల, యలహంక, విద్యారణ్యపుర, రాజానుకుంటె తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు ఏకధాటిగా వర్షం పడింది. ఫలితంగా- విమానాశ్రయంలోకి వరదనీరు పోటెత్తింది. రెండు అడుగుల మేర వరదనీరు నిలిచింది.
ట్రాక్టర్లపై ప్రయాణికులు..
విమానాశ్రయానికి వెళ్లే దారులపై కొన్ని చోట్ల మోకాలి లోతు వరకు వర్షపు నీరు నిలిచింది. ఫలితంగా- క్యాబ్స్ తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో అటు విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు.. అక్కడి నుంచి నగరానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విమానాశ్రయానికి వెళ్లడానికి క్యాబ్స్ అందుబాటులో లేకపోవడంతో ట్రాక్టర్లపై కూర్చుని ప్రయాణం సాగించారంటే వర్షం ఏ స్థాయిలో దంచి కొట్టిందో అర్థం చేసుకోవచ్చు. రన్ వే మీద కూడా వర్షపు నీరు నిలిచినట్లు సమాచారం.
భారీగా ట్రాఫిక్ జామ్..
బెంగళూరులో నగరంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగి పడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యశ్వంతపుర, మత్తికెరె, మేఖ్రీ సర్కిల్, కృష్ణరాజ మార్కెట్, కేఆర్ సర్కిల్, మల్లేశ్వరం, మెజస్టిక్ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఇవ్వాళ కూడా బెంగళూరు సహా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా..
కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని విజయపురా, కొప్పళ, బళ్లారి, బెళగావి, బాగల్కోట్, రాయచూర్, గదగ్, దక్షిణ ప్రాంతంలోని చిక్మగళూరు, శివమొగ్గ, కొడగు, కోలార్, తుమకూరు జిల్లాల్లో మరో 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బెంగళూరులో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. సోమవారం ఒక్కరోజులోనే 139 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదే పరిస్థితి ఇంకొద్దిరోజులు కొనసాగే అవకాశాలు లేకపోలేదు.
Recommended Video

సాధారణ వర్షపాతం కంటే..
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ మధ్యకాలంలో నమోదయ్యే సాధారణ వర్షపాతం 69 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది ఆ రికార్డును బద్దలైంది. అటు కేరళకు ఆనుకుని ఉన్న మంగళూరు, చామరాజనగర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కేరళలోని కొల్లం, పథనంథిట్ట, అళప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో మూడురోజులుగా వర్షాలు పడుతున్నాయి. మైసూరు, దక్షిణ కన్నడ జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications