బంపర్ ఆఫర్: 70 శాతం రిజర్వేషన్లు
బెళగావి/బెంగళూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉపాధి కల్పనలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 50 నుంచి 70 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు.
బెళగావిలో జరుగుతున్న విధాన పరిషత్ శీతాకాల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. వచ్చే శాసన సభ సమావేశాల్లో రిజర్వేషన్ల సంబంధిత ముసాయిదాను ప్రవేశ పెడుతామని సిద్దరామయ్య చెప్పారు.
రిజర్వేషన్ల పెంపుపై జరిగిన చర్చలో సీఎం సిద్దరామయ్య జోక్యం చేసుకుని అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం రాష్ట్ర ప్రజల సమాజిక, విద్య, ఆర్థిక విషయాలపై సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు.
వచ్చే నెల (డిసెంబర్)లో సర్వే నివేదిక సిద్దం కానుందని చెప్పారు. సర్వేకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించినపుడే సామాజిక న్యాయాన్ని సాధించడం సులువవుతుందని సిద్దరామయ్య స్పష్టం చేశారు. మొత్తం మీద సీఎం తీసుకున్న నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.