ట్రెండింగ్లో నిలిచిన కర్ణాటక ట్రాన్స్జెండర్ మంజమ్మ: అసలు విషయం అదే..!
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ట్రాన్స్జెండర్, జానపద నృత్య కళాకారిణి మంజమ్మ జోగాతి (Manjamma Jogati) ట్రెండింగ్లో నిలిచారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న తరువాత ఆమె పేరు మార్మోగిపోతోంది. కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్ ప్రెసిడెంట్గా గుర్తింపు పొందారు. పద్మశ్రీ అవార్డును అందుకునే సమయంలో మంజమ్మ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు దిష్ఠి తీయడం చర్చనీయాంశమైంది.
Recommended Video
కర్ణాటకలో మంగళముఖిగా..
కర్ణాటకలో ట్రాన్స్జెండర్లను మంగళముఖిగా భావిస్తారు. వారిని అలానే పిలుస్తారు కూడా. ఏదైనా శుభకార్యం జరిపేటప్పుడు వారు ఎదురొచ్చినా, వారి ద్వారా దిష్ఠి తీయించుకున్నా.. శుభప్రదమని భావిస్తారు. ఏ కార్యం తలపెట్టిన అది మంగళప్రదంగా ముగుస్తుందని నమ్ముతారు కన్నడిగులు. అందుకే ట్రాన్స్జెండర్లను మంగళముఖిగా పిలుస్తారు. వారికి డబ్బులు ఇచ్చి మరీ దిష్టి తీయించుకుంటుంటారు చాలామంది. పద్మశ్రీ అవార్డును అందుకునే సమయంలోనూ మంజమ్మ.. రాష్ట్రపతికి దిష్ఠి తీశారు.
కరతాళ ధ్వనులతో..
పద్మశ్రీ అవార్డును అందుకునే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మంజమ్మ జొగాతి పేరును పిలిచిన వెంటనే ఆమె తన కుర్చీలో నుంచి లేచి రాష్ట్రపతి వైపు సాగారు. ఆ సమయంలో అహూతులు కరతాళ ధ్వనులతో ఆమెను స్వాగతించారు. తొలుత ఎదురుగా ఉన్న ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను నమస్కరించారు. అనంతరం రాష్ట్రపతి నిల్చుని ఉన్న పోడియం వైపు వడివడిగా వెళ్లారు.
చీరకొంగుతో..
పోడియం మెట్లకు నమస్కరించారు. అనంతరం రాష్ట్రపతి సమీపంలో నిలిచారు. ఎడమ చేత్తో తన చీర కొంగును పట్టుకుని రాష్ట్రపతికి తల నుంచి పాదాల వరకు మూడుసార్లు దిష్ఠి తీశారు. మళ్లీ రెండు చేతులను ఆయన చుట్టూ తిప్పారు. చేతులతో పోడియాన్ని రెండుసార్లు తట్టారు. చిరునవ్వుతో రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మ అవార్డును అందుకున్నారు. బ్యాడ్జిని ఆమె భుజానికి తగిలించి, ప్రశంసా పత్రాన్ని రాష్ట్రపతి ఆమెకు అందజేశారు.
మంజునాథ షెట్టి నుంచి మంజమ్మగా..
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మంజమ్మ జొగాతి పేరు ట్రెండింగ్లో నిలిచింది. బళ్లారి సమీపంలోని ఓ కుగ్రామం ఆమె స్వస్థలం. ఆమె అసలు పేరు మంజునాథ షెట్టి. తదనంతనం తన పేరును మంజమ్మగా మార్చుకున్నారు. జోగప్ప సామాజిక వర్గంలో చేరినందువల్ల జోగాతి అనేది ఇంటిపేరుగా మారింది. కన్నడిగుల ఆరాధ్యదైవం రేణుకా యల్లమ్మకు తమ జీవితాన్ని అర్పించుకున్న వారిని జోగప్ప సామాజికవర్గంగా భావిస్తారు.
15 ఏళ్ల వయసు నుంచే
మంజునాథ షెట్టికి 15 సంవత్సరాల వయస్సులో ఏర్పడిన శారీరక మార్పుల వల్ల ట్రాన్స్జెండర్గా మారారు. ఆడపిల్లగా ప్రవర్తిస్తుండటంతో తల్లిదండ్రులు హుళిగెమ్మ అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ జోగప్ప సామాజిక వర్గంలో చేర్పించారు. అమ్మవారిని పెళ్లాడినట్లుగా భావిస్తుంటుంది ఈ సామాజిక వర్గం. అప్పటి నుంచి మంజునాథ షెట్టి.. మంజమ్మగా మారారు. ఆ తరువాత జానపద కళాకారిణిగా ఆవిర్భవించారు. ఇప్పుడు అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు.