హతవిధి..! : 'వర్షాల కోసం.. నగ్నంగా ఊరేగింపు..'
కర్ణాటక : నిస్సహాయత మనుషులను కృంగదీస్తుంది. చైతన్యాన్ని పక్కకునెట్టి అజ్ఞానపు ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఫలితంగా శాస్త్రీయ దృక్పథం కొరవడి కొత్త మూఢ నమ్మకాలకు తెరలేవడం ఖాయం. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పరిధిలో ఉన్న వండరిహళ్లి గ్రామ ప్రజలకు ఈ వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయి.
వర్షాలు పడడం లేదన్న తీవ్ర నిస్పృహ అక్కడి ప్రజలను కొత్త మూఢ నమ్మకాల వైపు నడిపిస్తోంది. వర్షాల కోసం ఇప్పటిదాకా కప్పల పెళ్లిళ్లు.. వరుణ దేవుడికి పూజలు లాంటివి చేయడం అందరి దృష్టిలోకి వచ్చినవే. అయితే ఇందుకు భిన్నంగా పండరిహళ్లి గ్రామస్తులు ఓ బాలుడిని ఊరిలో నగ్నంగా ఊరేగించడం చర్చనీయాంశంగా మారింది.

చిత్రదుర్గ పరిధిలో ఈ ఏడాది కరువు విలయతాండవం చేస్తోంది. కొన్ని నెలలుగా అక్కడి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. ఇదే క్రమంలో వర్షాలు కురవాలని ఓ కొత్త మూఢ నమ్మకాన్ని తెరపైకి తీసుకొచ్చిన పండరిహళ్లి గ్రామస్తులు.. ఊరిలోని ఓ బాలుడిని నగ్నంగా చేసి, అతని చేతిలో ఓ వినాయకుడి విగ్రహం పెట్టి ఊరంతా తిరిగాల్సిందింగా ఆదేశించారు.
పెద్దల ఆదేశం మేరకు వాళ్లు చెప్పింది చెప్పినట్టు చేసిన ఆ బాలుడు, అక్కడి వీధుల్లో నుంచి నడుస్తుండగా మహిళలంతా అతనిపై నీళ్లు పోయడం మొదలుపెట్టారు. అలా.. ఊరంతా తిరిగిన బాలుడు చివరికి వినాయకుడి విగ్రహాన్ని ఊరి చివరన నిమజ్జనం చేసి ఊళ్లోకి అడుగుపెట్టాడు. అనంతరం అతడికి కొత్త బట్టలు కొనిచ్చారు గ్రామస్తులు.
కాగా, దీనిపై బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పండరిహళ్లి గ్రామస్తుల చర్య బాలల హక్కులను ఉల్లంఘించడమేనని మండిపడుతోంది. ఊళ్లో జరిగిన ఆ తతంగం మొత్తాన్ని ఎవరో వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టడంతో అది కాస్త బాలల హక్కుల కమిషన్ దృష్టికి వచ్చింది. వీడియో ఆధారంగా గ్రామస్తులపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది బాలల హక్కుల కమిషన్.












Click it and Unblock the Notifications