వైద్యం నిరాకరణ: రోడ్డుపైనే ప్రసవించిన మహిళ, సీఎం దిగ్భ్రాంతి
బీదర్: ఔరద్లోని తాలూకా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వైద్యం చేసేందుకు నిరాకరించడంతో ఓ మహిళ రోడ్డుపైనే ప్రసవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన అక్టోబర్ 13వ తేదీన చోటు చేసుకుంది. ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ మేరకు ఆయన ట్వీట్టర్ వేదికగా స్పందించారు. 'ఔరద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందక రోడ్డుపైనే మహిళ ప్రసవించిందనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆరోగ్యశాఖను ఈ విషయంపై ప్రశ్నించా. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించా' అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
అక్టోబర్ 13న మహారాష్ట్రకు చెందిన సురేఖ దీపక్ అనే గర్భిణీ మహిళ ప్రసవం కోసం ఔరద్ తాలూకా ఆస్పత్రికి వచ్చింది. అయితే, ఇది చాలా క్లిష్టతరమైన కేసు అని, ఇక్కడ వైద్యం చేయడం కుదరదని, బీదర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని తాలూకా ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న శిల్పా షింధే.. ఆమెకు సూచించారు.
దగ్గరలో ఎలాంటి ప్రైవేటు ఆస్పత్రి కూడా లేకపోవడంతో ఆ గర్భిణీ కుటుంబం ఎక్కడికి వెళ్లాలో తోచక ఆస్పత్రి ముందే ఉండిపోయింది. కాగా, సురేఖకు నొప్పులు ఎక్కువ కావడంతో వెంటనే వైద్యం అందించాలని.. ఆస్పత్రిలోని వైద్యులను వేడుకున్నాడు ఆమె భర్త, తల్లి.
కాగా, నొప్పులు పడుతున్న సురేఖ వైద్యం అందించకపోగా.. ఇక్కడ్నుంచి వెళ్లకపోతే పోలీసులకు ఫోన్ చేస్తామని వారిని బెదిరించారు వైద్యులు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్ను అందించలేదు. దీంతో విధిలేని పరిస్థితిలో ఆస్పత్రి నుంచి బయటకి వచ్చారు. నొప్పులు ఎక్కువ కావడంతో రోడ్డుపైనే కుప్పకూలిపోయింది సురేఖ. కాగా, రోడ్డుపైనే తల్లి సాయంతో బిడ్డను ప్రసవించింది సురేఖ.
బిడ్డను ప్రసవించిన అనంతరం సురేఖను ఆస్పత్రిలో వైద్యులు చేర్చుకున్నారని సురేఖ భర్త దిలిప్ కుమార్ తెలిపాడు. ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని మెడికల్ ఆఫీసర్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. కాగా, ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు.