బాబుకు కరుణ చురక, జగన్కు 'ప్రత్యేక' ఆఫర్ ఇచ్చినా..
చెన్నై/హైదరాబాద్: ఒకరి కంట్లో నీళ్లు, మరొకరి కంట్లో పాలు పోసే విధానాలను పక్కన బెట్టి, కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకునే విషయంపై దృష్టి సారించాలని డిఎంకె అధినేత కరుణానిధి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హితవు పలికారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని తమిళనాడువాసులకు తాగునీటి వనరుగా ఉన్న పాలారు నదిపై రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలన్న బాబు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పాలారు నదిపై రిజర్వాయర్ నిర్మాణం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, ఇప్పటికే పాలారు వ్యవహారం సుప్రీం కోర్టులో ఉన్నందున, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సొంతంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని కరుణానిధి ప్రశ్నించారు.
గౌరవం లేదన్న టిడిపి
సభా సంప్రదాయాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గౌరవం లేదని టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. బీఏసీ సమావేశం తర్వాత ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సభ్యుల పేర్లు ఇవ్వకుండానే సమావేశానికి ఆ పార్టీ గైర్హాజరైందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీఏసీకి గైర్హాజరై డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కూడా విమర్శించారు.
కాగా, ఎపి సభా వ్యవహారాల సంఘం (బిఏసి) తొలి భేటీకి ప్రధాన ప్రతిపక్షం జగన్ పార్టీ గైర్హాజరైన విషయం తెలిసిందే. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికిముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి తదితరులు స్పీకర్ను కలిశారు. సభలో సంఖ్యాబలాన్ని బట్టి బీఏసీలో 60% అధికార పక్షానికి...40% ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలని వారు ప్రతిపాదించారు.
కానీ టీడీపీ సమ్మతించలేదు. ఏడుగురు సరిపోతారని, ఇందులో టీడీపీకి 4, వైసీపీకి 2, బీజేపీకి ఒకటి ఇస్తామని ప్రతిపాదించింది. తర్వాత చీఫ్విప్ కాల్వ శ్రీనివాసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఛాంబర్కు వెళ్లి బీఏసీ భేటీకి విపక్ష నేత జగన్ను ఆహ్వానించారు. అక్కడా ఇదే చర్చ జరగ్గా, సంప్రదాయం ప్రకారమే వెళ్తున్నామని కాల్వ చెప్పా రు. పోనీ, ఒకరికి ప్రత్యేక ఆహ్వానితునిగా అవకాశం ఇవ్వాలని జగన్ కోరగా కాల్వ అంగీకరించారు. కానీ, బీఏసీ భేటీకి గైర్హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, చివరకు తమ సభ్యుల పేర్లు కూడా ఇవ్వలేదు.