కాశ్మీర్ ఎప్పటికైనా పాక్దే: రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: కాశ్మీర్ ఎప్పటికైనా పాకిస్థాన్ లో కలిసిపోతుందని అందులో సందేహం లేదని పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్, పాక్ విభజన ఎప్పటికి ముగిసిపోని అంశమని, కాశ్మీర్ ప్రజలు అదే కోరుకుంటున్నారని జోస్యం చెబుతున్నారు.
చాలా సంవత్సరాల నుండి కాశ్మీర్ కోసం భారత్, పాకిస్థాన్ లు పోరాటం చేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ సమితి జోక్యం చేసుకుని కాశ్మీర్ ను పాకిస్థాన్ లో కలిపితే శాంతియుత వాతవరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రహీల్ షరీఫ్ సోదరుడు 1971లో పాక్ సైన్యంలో ఉన్నాడు. అదే సమయంలో పాక్-భారత్ మధ్య కాశ్మీర్ సరిహద్దులలో జరిగిన కాల్పులలో అతను మరణించాడు. ప్రస్తుతం పాక్ ఆర్మీ చీఫ్ అయిన రహీల్ షరీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
పాకిస్థాన్ లోని ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి ఆపరేషన్ జర్బ్-ఏ-అజ్బ్ పేరుతో ఉగ్రవాదుల పనిబడుతున్నామని రహీల్ షరీఫ్ అన్నారు. అయితే రహీల్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివ సేన నాయకులు, ఎంపీలు, శాసన సభ్యులు మండిపడుతున్నారు. పాక్-భారత్ ల మధ్య సంబంధాలు దెబ్బతినే విధంగా రహీల్ మాట్లాడారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మండిపడ్డారు.