సిగ్గుచేటు, ప్రపంచంలో అందమైనది చిన్నారి నవ్వు: కథువా అత్యాచారంపై రాష్ట్రపతి కోవింద్
కత్రా: కథువా అత్యాచారం సిగ్గుచేటు అని, మహిళలు అందరికీ భద్రత కల్పించడం మన బాధ్యత అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం అన్నారు. ఇటీవల కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కత్రాలోని శ్రీమాతా వైష్ణోదేవీ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.
స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు అయిందని, ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎంతో సిగ్గుచేటు అన్నారు. మనం ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నామో గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పారు.
ప్రపంచంలో అన్నింటి కంటే అందమైనది చిన్నారి నవ్వు ముఖం అన్నారు. అలాంటి చిన్నారులకు భద్రత కల్పించడమే మన పెద్ద లక్ష్యం అన్నారు. ఇది మన బాధ్యత అన్నారు.
వివిధ రంగాల్లో మహిళలు ప్రతిభ కనబర్చడంపై రాష్ట్రపతి మాట్లాడుతూ... కామన్వెల్త్ గేమ్స్లో మన అమ్మాయిలు దేశం గర్వించేలా చేశారన్నారు. తెలంగాణ నుంచిసైనా నెహ్వాల్, పంజాబ్ నుంచి హీనా సిద్ధూ, మణిపూర్ నుంచి సంగీతా చాను, మీరాబాయి చాను, మేరీకోమ్, ఢిల్లీ నుంచి మానికా బాత్రాలు భారత్ను గర్వించేలా చేశారన్నారు.