కావూరి రెడీ: టీ బిల్లుపై సీమాంధ్ర ఎంపీల వ్యూహం?
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి తగిన కార్యాచరణ కోసం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఆయన ఇతర కేంద్ర మంత్రుల మద్దతు కూడగట్టి తెలంగాణ బిల్లును వ్యతిరేకించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడితే పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపేందుకు కావూరి అంగీకరించినట్లు చెబుతున్నారు.
మంగళవారం లోక్సభలో పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలుపుతానని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపేలా ఇతర సీమాంధ్ర కేంద్ర మంత్రులను కూడా ఒప్పిస్తానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా హెచ్చరించినా వెనక్కి తగ్గరాదని కేంద్ర మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో, ఒకవేళ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడితే దానిని ఎలా అడ్డుకోవాలనే అంశంపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు చర్చలు జరిపారు.
తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ రావు, మోదుగుల వేణుగోపాలరావు, నిమ్మల కిష్టప్ప, కెవిపి రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్కుమార్, సబ్బం హరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం సోమవారం రాత్రి స్థానిక వైఎంసీఏ ఆవరణలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో స్పీకర్ మీరాకుమార్ నడిచినంత వరకూ సీమాంధ్రకు న్యాయం జరగదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు మోదుగుల వ్యాఖ్యానించారు.
సీమాంధ్రకు అన్యాయం జరిగితే మద్దతు ఇవ్వబోమని బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ కూడా తమకు హామీ ఇచ్చారని కొనకళ్ల తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే విభజనను ఇలా చేస్తున్నారని, మరో 8 రోజులు సభను అడ్డుకుంటే చాలని ఉండవల్లి చెప్పారు. సభలోనే ప్రాణ త్యాగం చేసుకుంటానని సబ్బం హరి ప్రకటించటంతో సోమవారం మార్షల్స్ అంతా అతని చుట్టే తిరిగారని ఉండవల్లి తెలిపారు.
ఈసారి పార్లమెంటులో కనీవినీ ఎరుగని ఘటనలు జరుగుతాయని గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే నిఘా వర్షాలు, మార్షల్స్ పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. సీమాంధ్ర ఎంపీలు ఏం చేయబోతున్నారనే విషయమై ఆరా తీస్తున్నారు.