గుజరాత్ ఎన్నికల్లో వారికే పట్టం? సర్వేల్లో వెల్లడి!
గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి కాంగ్రెస్ నుంచి కాకుండా ఆప్ నుంచి ఊహించని ప్రమాదం ఎదురవుతోంది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు ఆప్వైపు మొగ్గుచూపుతున్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఈ సమయంలో ఆప్ నేతలపై సీబీఐ దాడులు, ఈడీ దాడులు జరుగుతుండటం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా ఆప్ నేతల పర్యటనలు
ఆప్ నేతలు గుజరాత్ వ్యాప్తంగా విస్త్రత పర్యటనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనకు వెళ్లారు. వడోదర విమానాశ్రయానికి చేరుకున్న కేజ్రీవాల్ బయటకు రాగానే మోడీ మోడీ అంటూ అక్కడున్నవారంతా నినాదాలు చేశారు.కేజ్రీవాల్ కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ గుజరాత్లో పర్యటించిన సమయంలో బీజేపీ నేతలు ఇలా నినాదాలు చేయలేదని, తనని, ఆమ్ ఆద్మీ పార్టీని వేదించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒకటై ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఆప్ నుంచి బీజేపీకి పెను సవాల్
రాష్ట్రంలో బీజేపీకి ఆప్ నుంచి పెనుసవాల్ ఎదురవబోతోందన్నారు. రాష్ట్రంలోని 66 పట్టణ ప్రాంతాల్లో కమలం ఎప్పుడూ ఓడిపోలేదని, ఈసారి ఆ సీట్లను తాము సొంతం చేసుకోబోతున్నట్లు తెలిపారు. వడోదరతోపాటు పలు ప్రాంతాల్లో అరవింద్ టౌన్ హాల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానాన్నే తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యోగులకు పాత పింఛనుపై హామీ
వడోదర పర్యటనలో భాగంగా ఆయన పలు వర్గాల ప్రజలతో ఆయన టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ పాత పింఛను విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లోను ఆప్ నుంచి బీజేపీకి పెను ప్రమాదం ఎదురవబోతున్నట్లు తేలింది. గుజరాత్ ప్రచారంలో మీడియా నుంచి ఎటువంటి కవరేజ్ ఇవ్వనీయకుండా కొన్ని టీవీ ఛానెళ్ల యాజమాన్యాన్ని నరేంద్రమోడీ సన్నిహితుడు బెదిరంచినట్లుగా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల నడుమ ఆయన జరుపుతున్న గుజరాత్ పర్యటనలో ప్రతిచోట ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.