కేజ్రీవాల్ నోట.. హనుమాన్ చాలీసా: అనర్గళంగా: ఆంజనేయుడికి కఠోర భక్తుడినంటూ..!
న్యూఢిల్లీ: సాధారణంగా రాజకీయ నాయకులు కుల, మతాలకు అతీతంగా వ్యవహరిస్తుంటారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాల్సి ఉండటం వల్ల, ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను గాయపరచకుండా ప్రవర్తిస్తుంటారు. అధికారాన్ని అందుకున్న తరువాత కూడా అదే వైఖరిని కొనసాగించాల్సి ఉంటుంది. ఏ కులానికో, లేదా మతానికో సంబంధించిన ఓటర్లు ఓటు వేస్తే అధికారాన్ని అందుకోరు. అందుకే- అన్ని మతాల వారినీ సమదృష్టితో చూడాల్సి ఉంటుంది.
Union Budget 2020: ఢిల్లీకి ఏమిచ్చారు? బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి: కేజ్రీవాల్ ఎన్నికల నినాదం..!
బీజేపీని ఢీ కొట్టాలంటే..
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ట్రెండ్లో మార్పులు చోటు చేసుకున్నాయి. హిందూపార్టీగా ముద్ర పడిన బీజేపీని గానీ, ఆ పార్టీ నాయకులను ఎన్నికల బరిలో ఢీ కొట్టి నిలవాలంటే- బీజేపీ అనుసరించే బాటనే ప్రయాణించక తప్పని పరిస్థితి ఏర్పడిందనే భావన రాజకీయ నాయకుల్లో వ్యక్తమౌతోంది. దీనికి ప్రధాన కారణం- మెజారిటీ ఓటర్లు హిందువులు కావడం వల్లే. పైగా- హిందూయిజానికి, హైందవ సమాజానికి తామే ప్రతినిధులమని చెప్పుకొంటోన్న కమలనాథులను ఎదుర్కొనడానికి తామూ కాషాయరంగును ధరించక తప్పట్లేదని, హిందూ వ్యతిరేకులం కాదని చెప్పుకోవాల్సి వస్తోందనే అభిప్రాయం నెలకొంది.
ఇదివరకు రాహుల్ గాాంధీ..
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ మతం ప్రస్తావన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాను కాశ్మీరీ హిందువునని, తనది ఫలానా గోత్రనామం అంటూ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన, ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది రాహుల్ గాంధీకి. తాను పోటీ చేసిన కేరళలోని వాయనాడ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చారిత్రాత్మక తిరునెళ్లి ఆలయాన్ని సందర్శించారు. తన పూర్వీకులకు పిండప్రదానం చేశారు.
ఇప్పుడు కేజ్రీవాల్..
తాజాగా- ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితీ అంతే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వాన్ని ముమ్మరం చేసిన ఆయన.. ప్రత్యేకించి- హిందూ ఓటుబ్యాంకును పోగొట్టుకోకూడదనుకుంటున్నారు. పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తోన్న హిందువుల ఓట్లు ఈ సారి బీజేపీకి ఎక్కడ బదిలీ అవుతుందోననే ఆందోళనలో కనిపిస్తున్నారాయన.
హనుమంతుడికి కఠోర భక్తుడిగా..
అందుకే- తాను దేవుడిని నమ్ముతానని, హనుమంతుడికి కఠోర భక్తుడిననీ అన్నారు. ఓ ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్.. ఇదే అంశంపై మాట్లాడారు. బీజేపీ హిందు ఓట్లను కొల్లగొట్టడానికి, తనపై హిందూ వ్యతిరేకి అనే ముద్రను వేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను హిందూ వ్యతిరేకిని కానని, క్రమం తప్పకుండా ఢిల్లీ కన్నాట్ ప్లేస్లోని హనుమంతుడి ఆలయానికి వెళ్తుంటానని చెప్పుకొచ్చారు. కొంతసేపు హనుమాన్ చాలీసాను అనర్గళంగా వినిపించారు.
హనుమాన్ చాలీసాను ఆలపించి..
అజెండా ఢిల్లీ పేరుతో ఆ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్- కేజ్రీవాల్ను బీజేపీ హిందూ వ్యతిరేకిగా ప్రచారం చేస్తోందని, దీన్ని ఎలా తిప్పి కొడతారంటూ ప్రశ్నించగా.. ఆయన తాను హనుమంతుడి భక్తుడినని చెప్పుకొన్నారు. హనుమాన్ చాలీసా వస్తుందా? అని యాంకర్ ప్రశ్నించగా.. పాడి వినిపిస్తానని తన గొంతును సవరించుకున్నారు. హనుమాన్ చాలీసా కొంతభాగాన్ని ఆలపించారు.