తెలియక పొరపాటు, మళ్లీ చేయను: కేజ్రీవాల్, ఏఏపీ బస్సు కండిషన్లో..
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలోకి వస్తే గతంలో చేసిన పొరపాటును తాను మళ్లీ చేయనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అన్నారు. ఆయన న్యూయార్క్లోని ఏఏపీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయనని చెప్పారు. రాజకీయం పైన అవగాహన లోపం కారణంగా గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 49 రోజులకే తాను రాజీనామా చేశానని చెప్పారు. ఈసారి అలాంటివి పునరావృతం కానివ్వనన్నారు. పార్టీ నుండి వలసలను ఆయన కొట్టిపారేశారు.
తమ పార్టీ బస్సు పూర్తి కండిషన్లో ఉందని వ్యాఖ్యానించారు. అన్ని భాగాలు కూడా బాగా పని చేస్తున్నాయని చెప్పారు. డ్రైవర్ పైన అందరికీ నమ్మకం ఉందన్నారు. తాము రాజీనామా చేస్తున్నందున వెంటనే ఎన్నికలు వస్తాయని భావించామని అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి రాజీనామా పైన వ్యాఖ్యానించారు.
అది రాజకీయంగా తప్పుడు అంచనా అని, అది పొరపాటు అన్నారు. ఈసారి మాత్రం అలా చేసేది లేదన్నారు. ఇప్పుడు బీజేపీకి ఎలాంటి అజెండా లేదన్నారు. తాము ఢిల్లీలో 20 కళాశాలలు ఓపెన్ చేస్తామని చెబితే, బీజేపీ మాత్రం అమ్మాయిలు జీన్స్ ధరించవద్దని చెబుతోందని ఆరోపించారు.
ఢిల్లీ నగరంలో మహిళలు, అమ్మాయిల భద్రత, రక్షణ కోసం నగరవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవద్దని బీజేపీ చెబుతోందని విమర్శించారు. ఇవి తమ పార్టీకి, బీజేపీకి మధ్య ఉన్న తేడాలు అన్నారు.