కేంద్రం ప్రజలకు 'స్లో పాయిజన్' ఇస్తోంది.. కేజ్రీవాల్ సంచలనం
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. చమురు, గ్యాస్ రవాణా నిలిచిపోయింది. దాంతో ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ ఇరాన్- అమెరికా యుద్ధ సెగలు తాకుతున్నాయి. అయితే వారం రోజుల వ్యవధిలోనే చమురు సంస్థలు మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, ఎల్ పీజీ ధరలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు.
గత 10 నుంచి 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మూడుసార్లు పెంచిందని కేజ్రీవాల్ విమర్శించారు. ఈ విధంగా ప్రతిరోజూ ధరలను పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు స్లో పాయిజన్ ఇస్తోందని ఆయన కీలక ఆరోపణలు చేశారు. గత రెండు వారాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ. 4 నుంచి రూ.5 వరకు పెరిగాయని.. గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ధర రూ. 150 కు చేరుకుంటుందనే పుకార్ల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనల్లో, షాక్ లో ఉన్నారని దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
రష్యా, ఇరాన్ దేశాలు భారత్ కు తక్కువ ధరకే ముడి చమురు, గ్యాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నాయని.. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. కేంద్రం ఎందుకు ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ధరల పెరుగుదలే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడిందని కేజ్రీవాల్ ఆరోపించారు. గుజరాత్ లో డీజిల్ కోసం పెట్రోల్ పంపుల వద్ద ట్రాక్టర్ల సుదీర్ఘ క్యూలు ఉన్నాయని.. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్, మహారాష్ట్ర లోని అకోలా, బుల్దానా వంటి ప్రాంతాల్లో కూడా ఇంధనం, గ్యాస్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ మేరకు కొన్ని వీడియో క్లిప్ లను కేజ్రీవాల్ రిలీజ్ చేశారు.

ఈ దేశం ఏ రాజకీయ నాయకుడిదో లేక ఏ పార్టీదో కాదని 140 కోట్ల మంది ప్రజలదని కేజ్రీవాల్ తెలిపారు. రష్యా, ఇరాన్ ల నుంచి భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయాలా..? వద్దా..? అనే అంశంపై ప్రజలందరూ తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications