Goa Polls: కేజ్రీవాల్ వర్సెస్ మమతా బెనర్జీ, గోవాలో టీఎంసీ రేసులో కూడా ఉండదన్న ఆప్ అధినేత
2022 సంవత్సరం ప్రారంభంలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ గోవాపై ఫోకస్ పెట్టాయి. ఎన్నికలకు ముందు గోవాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గోవాలో నువ్వా నేనా అన్నట్టు, ప్రధాన పార్టీలకు దీటుగా కొత్త పార్టీలు సమరానికి సై అంటున్నాయి. గోవా ఎన్నికల లక్ష్యంగా చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ ఒకదానికొకటి ఢీ అంటున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తృణమూల్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. గోవాలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ "రేసులో కూడా లేదు" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
వేషం మార్చి స్వామీజీగా.. ఎలమంచిలిలో సంక్షేమ పథకాలపై ఆరా; ఎవరో తెలిసి అవాక్కైన ప్రజలు
టీఎంసీకి 1 శాతం ఓట్లు కూడా రావన్న అరవింద్ కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్, గోవాలో అనవసరంగా టిఎంసికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం టీఎంసీకి 1 శాతం ఓట్లు కూడా రావని ఆయన పేర్కొన్నారు. అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చి పోయే వారు గోవాకు అవసరంలేదని, ప్రజాస్వామ్యం ఇలా పనిచేయదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో కష్టపడి పనిచేయాలి, ప్రజల మధ్య పనిచేయాలని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మీ దృష్టిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనది కావచ్చు, కానీ నా దృష్టిలో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రేసులో ఉందని కూడా తాను అనుకోను అంటూ గోవా మీడియాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.
టీఎంసీని లైట్ తీసుకోవాలి అన్న కేజ్రీవాల్
ఇక తన ప్రసంగంలో టీఎంసీ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశంలో 1,350 (రాజకీయ) పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీల గురించి తాను చెప్పాలా అంటూ ప్రశ్నించారు . పనాజీ ర్యాలీతో ఆప్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత విలేకరుల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన చాలా ఘాటుగా సమాధానమిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ కు గోవా ఎన్నికల్లో ప్రజాదరణ పొందే సీన్ లేదన్నారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలకు ఘాటుగా రిప్లై ఇచ్చిన టీఎంసి
కేజ్రీవాల్ వ్యాఖ్యలపై గోవా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ, ప్రజల కోసం పనిచేయాలని తాము వచ్చామని, ఎన్నికల అంచనాలు మరియు వోట్ షేర్ అంచనాలలో మునిగి తేలేవారు వారి రాజకీయ అపరిపక్వతను ప్రదర్శిస్తున్నారు అంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వారిలో నిరాశ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అన్నారు. ఎవరిని సీరియస్గా తీసుకోవాలో గోవా ప్రజలే నిర్ణయిస్తారని వీటిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చింది.
టీఎంసి పై కేజ్రీవాల్ వ్యాఖ్యలతో గోవా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
అవినీతిరహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయడానికి ఆప్కి ఓటు వేయాలని గోవా ప్రజలకు విజ్ఞప్తి చేసిన అరవింద్ కేజ్రివాల్ తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ గోవా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోవా ఎన్నికలలో బిజెపికి గట్టిగా సమాధానం చెప్పాలని దూకుడుగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో టిఎంసిపై కేజ్రీవాల్ విరుచుకుపడడం గోవా రాజకీయాలలో ప్రాధాన్యతను సంతరించుకుంది