Kendriya Vidyalayaలో ఒకటవ తరగతికి అడ్మిషన్స్: పూర్తి వివరాలు మీకోసం..!
తమ పిల్లలకు మంచి విద్యాబోధన అందించాలని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటవ తరగతితో పాటు ఇతర తరగతులకు కూడా అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రీయ విద్యాలయాల్లో సీబీఎస్ఈ సిలబస్ ఉంటుంది. ఇక ఏప్రిల్ 1వ తేదీనుంచి ఒకటవ తరగతి అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న తల్లిదండ్రులకు కేంద్రీయ విద్యాలయాలు బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తోంది. కొన్ని వేలమంది తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ కోసం ఏటా దరఖాస్తు చేస్తారు.
ఇక ఒకటవ తరగతికి అడ్మిషన్స్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా జరుగుతాయి. 1 ఏప్రిల్ 2021 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఒకటవ తరగతి అడ్మిషన్ ప్రక్రియకు చివరి తేదీ 19 ఏప్రిల్ 2021.ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకటవ తరగతి అడ్మిషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుండగా.. 2వ తరగతి నుంచి ఆ పై తరగతులకు అడ్మిషన్ ప్రక్రియ ఆయా విద్యాలయాల్లో ఖాళీల ఆధారంగా ఆఫ్లైన్ ప్రక్రియలో జరుగుతాయి. ఆఫ్ లైన్ ద్వారా రెండవ తరగతికి ఆపై తరగతులకు 8 ఏప్రిల్ 2021 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం తల్లిదండ్రులు విద్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఆయా కేంద్రీయ విద్యాలయాల్లో సమర్పించేందుకు చివరి తేదీ 15 ఏప్రిల్ 2021. అయితే ఆయా కేంద్రీయ విద్యాలయాల్లో రెండవ తరగతి ఆపై తరగతుల్లో ఉన్న ఖాళీల ఆధారంగా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది.
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ (https://kvsonlineadmission.kvs.gov.in)ను సందర్శించగలరు. అంతేకాదు అడ్మిషన్స్ ప్రక్రియ కోసం ఆండ్రాయిడ్ అప్లికేషన్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించి అన్ని వివరాలు వెబ్సైట్ లేదా ఆండ్రాయిడ్ మొబైల్ వెర్షన్పై తెలుసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా 1247 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా... త్రివిధ దళాల్లో పనిచేసేవారి పిల్లల కోసం ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. ఉద్యోగరీత్యా తరుచూ బదిలీలపై పలు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో వారి పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాలను తీసుకొచ్చింది. త్రివిధ దళాల్లో పనిచేసే ఉద్యోగస్తుల పిల్లలకు అడ్మిషన్ తప్పనిసరిగా దొరుకుతుంది. అయితే సామాన్య పౌరుల పిల్లలకు ఆయా తరగతులో ఉండే ఖాళీల ఆధారంగా నిబంధనలను అనుసరిస్తూ భర్తీ చేయడం జరుగుతుంది. ఇక సింగిల్ చైల్డ్ గర్ల్ కోటా కూడా ఉంది. అంటే తల్లిదండ్రులకు ఒకే ఆడపిల్ల ఉండి ఇక ఆ తర్వాత పిల్లలు లేకపోతే అలాంటి వారికి అడ్మిషన్ దొరుకుతుంది. ఇక విద్యాహక్కు చట్టం (RTE) కింద కూడా కొన్ని సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ కోటాలో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తానికి సెంట్రల్ సిలబస్తో కూడిన విద్యను అతి తక్కువ ఫీజుతో పిల్లలకు అందించాలనుకునే తల్లిదండ్రులకు కేంద్రీయ విద్యాలయాలు చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే విద్యను ప్రైవేట్ స్కూళ్ల నుంచి పొందాలంటే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.