కామ్రేడ్ల అనూహ్య చర్య: పినరయి విజయన్ రాజీనామా: కొత్త ముఖ్యమంత్రి కోసం వేట: ప్రతిపక్షనేతగా
తిరువనంతపురం: దేశంలో కమ్యూనిస్టుల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది.. కేరళ ఒక్కటే. ఇదివరకు పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పటికీ- ఇప్పుడక్కడ ఆ పరిస్థితి లేదు. పశ్చిమ బెంగాల్లో ఒక్క స్థానాన్ని గెలుచుకోవడానికీ కష్టపడ్డారు కమ్యూనిస్టులు. కామ్రేడ్ల కంచుకోట పశ్చిమ బెంగాల్ను మమతా బెనర్జీ కూల్చి వేశారు. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చయబోతోన్నారు. త్రిపుర పరిస్థితీ అంతే. ఇక మిగిలింది- కేరళ మాత్రమే. మలయాళీలు కమ్యూనిస్టులకు పట్టం కడుతూనే వస్తున్నారు.
Recommended Video
వామపక్ష పార్టీలు సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)ను వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకుని రావడంలో కీలక పాత్ర పోషించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈ క్రమంలో చరిత్రను తిరగరాశారు. 40 సంవత్సరాల తరువాత.. వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకున్న కూటమిగా రికార్డు సృష్టించారు. ఈ పరిస్థితుల్లో సీపీఎం పొలిట్బ్యూరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త ముఖ్యమంత్రిని అన్వేషిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా- పినరయి విజయన్తో రాజీనామా చేయించింది.
పార్టీ ఆదేశాల మేరకు పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. తిరువనంతపురంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా సీపీఎం పొలిట్బ్యూరో పినరయితో రాజీనామా చేయించింది. కొత్త ప్రభుత్వం రూపురేఖలు ఎలా ఉండాలి? దీనికి ఎవరు సారథ్యాన్ని వహించాలి? ముఖ్యమంత్రి స్థానాన్ని ఎవరు అధిరోహించాలనే విషయంపై ఈ సాయంత్రం ఓ కీలక ప్రకటన చేయబోతోంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 99 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా- ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూడా పార్టీలో మార్పులు, చేర్పులపై దృష్టి సారించింది. ప్రతిపక్ష నేతగా రమేష్ చెన్నితల తప్పుకొనే అవకాశం ఉన్నందున.. ఆ స్థానాన్ని మరో సీనియర్ నేతతో భర్తీ చేయాలని భావిస్తోంది. రమేష్ చెన్నితల ప్రతిపక్ష నేత హోదా నుంచి తప్పుకోవడమంటూ జరిగితే- ఆ స్థానాన్ని వీడీ సతీషన్ భర్తీ చేస్తారని సమాచారం. పరవూర్ నియోజకవర్గం నుంచి ఆయన నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనతో పాటు తిరువన్చూరు రాధాకృష్ణన్, పీటీ థామస్ కూడా ఆ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.