మతాంతర వివాహం: ఓ విద్యార్ధినికి కాలేజీ వేధింపులు
తిరువనంతపురం: మతాంతర వివాహం చేసుకున్న ఓ విద్యార్ధినిని కాలేజీకి రావొద్దని యాజమాన్యం చెప్పిన సంఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లో చోటు చేసుకుంది. దీనిని నిరసిస్తూ ఆ విద్యార్ధిని కేరళ కేరళ రాష్ట్ర మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే బాధితురాలు నీరజ కోజికోడ్లోని ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఎమ్ఈఎస్ ఎఫ్జీఎమ్ మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మహ్మద్ రమీజ్ (23) అనే యువకుడిని ప్రేమించి, ఫిబ్రవరి 6వ తేదీన రిజిస్టర్ పెళ్లి చేసుకుంది.
అయితే వివాహం జరిగిన వారం రోజుల తర్వాత కళాశాలకు వెళ్లగా తరగతులకు హాజరు కానీయకుండా ఆమెను కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. తల్లిదండ్రుల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నందువల్ల, మిగతా విద్యార్థులకు చెడు సంకేతాలు అందుతాయని, ఈ కళాశాలలో నువ్వు చదువు కొనసాగించేందుకు వీల్లేదని యాజమాన్యం చెప్పింది.
తనకు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని కళాశాల యాజమాన్యం వద్ద ప్రాథేయపడగా ఇస్లాంలోకి మారితే ఈ విషయాన్ని పరిశీలిస్తామని వారు చెప్పారని నీరజ పేర్కొన్నారు. అయితే పెళ్లి తర్వాత మతం మారకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. కళాశాల నిర్ణయంతో ఒకింత అవేదనకు గురైన నీరజ కళాశాల నుంచి టీసీ తీసుకుని వేరే కళాశాలలో చేరేందుకు నిర్ణయించుకుంది.
దీంతో తన సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్ను కోరామని చెప్పారు. దీనిపై రమీజ్ మాట్లాడుతూ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా కళాశాల యాజమాన్యం అంగీకరించడం లేదని, వాటిని కాలికట్ విశ్వవిద్యాలయంలో సమర్పించామని చెప్తున్నారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ను సంప్రతించేందుకు రెండుసార్లు ప్రయత్నించామన్నారు.
అయితే దీనిపై కళాశాల యాజమాన్యం స్పందన వేరేలా ఉంది. నీరజ, రమీజ్ ఆరోపణలపై కళాశాల అధికారులు స్పందిస్తూ నీరజ 10 రోజులు తరగతులకు హాజరు కాలేదన్నారు. అందువల్ల వివరణ ఇచ్చేందుకు ఆమె తల్లిదండ్రులను తీసుకురావాలని కోరామని తెలిపారు. కళాశాల అనుసరిస్తున్న క్రమశిక్షణ విధానంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నామన్నారు.