ఆమె గాంధీ కాదు, మోసకారి: కాంగ్రెస్ లీడర్
తిరువనంతపురం: కేంద్ర మంత్రి మేనకా గాంధీ మీద కేరళ కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేనకా గాంధీ ఓ మోసకారి అంటూ కేరళ ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితల అసెంబ్లీ సాక్షిగా నోరు పారేసుకున్నారు.
కేరళ విషయంలో జోక్యం చేసుకోవడానికి మేనకా గాంధీ ఎవరు ? ఈ అధికారం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు ఇచ్చారు అంటూ శాసన సభ లో ప్రశ్నించారు. గురువారం కేరళ శాసన సభ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన రమేష్ కేరళలో వీధి కుక్కలను చంపరాదని చెప్పడానికి మేనకా గాంధీకి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. తిరువనంతపురం జిల్లాలో 90 ఏళ్ల వృద్దురాలిని వీధి కుక్కలు అతి దారుణంగా కరిచి చంపేశాయని ఆయన ఆరోపించారు.
వృద్దురాలిని చంపేసిన వీధి కుక్కలను కాంగ్రెస్ యువజన నాయకులు పెద్ద సంఖ్యలో వీధి కుక్కలను పట్టుకుని విచక్షణ రహితంగా చంపారని ఆమె ఆరోపించారని అన్నారు. అయితే జంతు ప్రేమికురాలైన మేనకా గాంధీ దీన్ని ఎలా ఖండించారు అని ప్రశ్నించారు.
వీధి కుక్కలను చంపిన వారి మీద అసాంఘిక కార్యకలాపాల వ్యతిరేక చట్టం కాపా ప్రయోగించాలని ఆమె ఎలా డిమాండ్ చేశారు అని రమేష్ ప్రశ్నించారు. మూగ జీవాలను చంపడానికి ఉసిగొల్పిన వారిని ఉరి తియ్యాలని మేనకా గాంధీ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
మేనకా గాంధీ వ్యాఖ్యలపై కేరళ అధికార, ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేనకా గాంధీ వ్యాఖ్యలపై కేరళ అసెంబ్లీలో దూమరం రేగింది. అయితే ఈ విషయంపై కేంద్ర మంత్రి మేనకా గాంధీ స్పందించాలి.