మరో ఏనుగూ అలాగే బలైంది.. వెలుగులోకి మరో సంచలన ఘటన..
కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ ఆడ ఏనుగు మృతి వెనుక వెలుగుచూసిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. ఈ ఘటన గురించి మరిచిపోకముందే.. ఇలాంటిదే మరో ఘటన అదే రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో వెలుగుచూసింది. పతనపురం అటవీ ప్రాంతంలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న మరో ఆడ ఏనుగును అటవీ అధికారులు గుర్తించారు. మంద నుంచి తప్పిపోయిన ఆ ఏనుగు దవడ పగిలిపోయి ఉందని.. ఆహారం తీసుకోలేని స్థితిలో అది చిక్కిపోయి ఉందని అధికారులు వెల్లడించారు.
Recommended Video

అధికారులు ఏమంటున్నారు..
'అటవీ అధికారులు ఆ ఏనుగును గుర్తించినప్పుడు.. అది చాలా బలహీనంగా ఉంది. అయితే అధికారులను చూడగానే అది అడవిలోకి పరిగెత్తి తిరిగి ఏనుగుల మందలో కలిసింది. కానీ మరుసటి రోజు అది మరోసారి మంద నుంచి తప్పిపోయి కనిపించింది. దాని నోట్లో తీవ్ర గాయాలయ్యాయి. వెటర్నరీ వైద్యులు దానికి తగిన వైద్యం అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో అది మృతి చెందింది.' అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఏనుగు మృతిపై విచారణ..
కొల్లాం జిల్లాలో ఆడ ఏనుగు మృతి ఘటనపై విచారణ జరుపుతున్నట్టు మరో అధికారి తెలిపారు. క్రాకర్స్ నింపిన ఆహార పదార్థాన్ని ఏనుగు నోట్లో ఎవరైనా పెట్టి ఉంటారని.. దాంతో అది పేలి తీవ్ర గాయాలై ఉండవచ్చునని అన్నారు. ఇలాంటి ఘటనలపై విచారణల్లో సమాచారం సంపాదించడం అంత సులువు కాదని మరో అటవీ అధికారి అన్నారు. ఏనుగులు ఒక రోజులో ఎన్నో కి.మీ ప్రయాణిస్తాయని.. ఆ ప్రయాణంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ వాటికి ఆహారం అందించి ఉంటారో కనిపెట్టడం సులువు కాదని అన్నారు. మలప్పురం,కొల్లాం జిల్లాల్లో ఒకే తరహాలో రెండు ఏనుగులు మృతి చెందడంపై కేరళ అటవీ శాఖ మంత్రి కె రాజు వన్యప్రాణి సంరక్షణ అధికారుల నుంచి నివేదిక కోరారు.

దేశవ్యాప్తంగా అందరూ చలించిపోయిన ఘటన..
మే 27 సాయంత్రం మలప్పురం జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఓ ఆడ ఏనుగు మృతి చెందడాన్ని అధికారులు గుర్తించారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్కు చెందిన అధికారి మోహన్ కృష్ణన్ ఏనుగు మృతి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నాపిల్ పండు తినడంతో నోట్లో పేలుడు సంభవించి.. దానితో పాటు దాని కడుపులో ఉన్న పిల్ల ఏనుగు కూడా మృతి చెందినట్టు ఆయన తెలిపారు. సాధారణంగా అడవి పందుల నుంచి పంట పొలాలను పాడుకునేందుకు స్థానికులు బాణసంచాతో నింపిన పైనాపిల్ పండ్లను ఉపయోగిస్తుంటారు. ఇదే తరహాలో ఆ ఏనుగుకు కూడా ఎవరో బాణసంచా నింపిన పైనాపిల్ పండును అందించడంతో.. అది దాని మృతికి కారణమైంది. ఆకలితో అలమటించిన ఏనుగు భరించలేని నొప్పి కారణంగా ఏమీ తినలేకపోయింది. చివరకు వెలియార్ నదీలోకి వెళ్లి అందులో నిలబడి.. రోజుల తరబడి అక్కడే నీళ్లు తాగుతూ బతికింది. కానీ పరిస్థితి విషమించి చివరకు మృతి చెందింది.












Click it and Unblock the Notifications