కేరళ విపత్తు: అధికారుల కక్కుర్తి! సహాయ సామాగ్రిని మాయం చేస్తూ.. అరెస్ట్
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు, కేంద్రం, సినీ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ అధికారులు.. వారికి అందాల్సిన సహాయక సామాగ్రిని మాయం చేస్తూ చేతివాటం ప్రదర్శించారు. దీన్ని గుర్తించిన పోలీసులు వారిని కటకటాల వెనక్కినెట్టారు.
ఆ వివరాల్లోకి వెళితే.. వయనాడ్ జిల్లాకు చెందిన థామస్, దినేష్ ప్రభుత్వ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ పనమరామ్ గ్రామంలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరం వద్దకు వెళ్లి అక్కడి సహాయక సామాగ్రిని వాహనంలోకి ఎక్కిస్తుండగా అడ్డుకున్నారు. దీంతో ఈ సామాగ్రిని మరో శిబిరానికి తీసుకెళ్తున్నామని ప్రజలకు నమ్మబలికారు.
అయితే, వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.
స్వలాభం కోసం సామాగ్రిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తేలడంతో థామస్, దినేశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చెంగనూర్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సహాయక సామాగ్రిని దొంగతనంగా తరలిస్తున్న తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.