ఒక్కరోజే 292 కోవిడ్ పాజిటివ్ కేసులు: ముగ్గురు మృతి: కోరలు చాస్తోన్న మహమ్మారి
Covid 19 variant JN.1: రెండు సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. క్రమంగా విజృంభిస్తోంది. కోవిడ్ 19 కొత్త వేరియంట్ జేఎన్.1 (Covid 19 variant JN.1) ఇప్పటికే కేరళలో తిష్టవేసింది. అంచనాలకు అందని విధంగా వ్యాప్తి చెందుతోంది.
తాజాగా 24 గంటల వ్యవధిలో కేరళలో కొత్తగా 292 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఈ స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడం రెండేళ్ల తరువాత ఇదే తొలిసారి. మరణాలు సైతం అనూహ్యంగా పెరిగాయి. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,041 చేరింది.

కేరళలో కరోనా వైరస్.. అనూహ్యంగా వ్యాప్తి చెందుతోందనడానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. ఒకేసారి 292 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ మార్గదర్శకాలను అమలులోకి తీసుకొచ్చింది. మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని ఆదేశించింది.
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తోన్న నేపథ్యంలో మరిన్ని ముందుజాగ్రత్తలను తీసుకుంటోంది. ఆర్టీపీసీఆర్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలంటూ పథినంథిట్ట జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
కోవిడ్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉన్నామని వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దీన్ని నియంత్రించడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, రోజువారీ ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహించేలా చర్యలు చేపట్టామని అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, పీపీఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
కేరళతో పాటు పొరుగునే కర్ణాటకలోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇక్కడ తొమ్మిది కేసులు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్, ఢిల్లీల్లో మూడు చొప్పున, గోవాలో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications