సబ్బు వాడినా అందం ఇవ్వలేదు, పరిహారం వచ్చింది
తిరువనంతపురం: మా ప్రోడక్ట్ వాడి అందంగా మారండి అంటూ ఊదరగొట్టే యాడ్లను రోజు చూస్తుంటాం. వాటిని మనం ఎవరు కూడా సీరియస్గా తీసుకోమనే చెప్పవచ్చు. కానీ ఓ అడ్వర్టయిజ్మెంటును సీరియస్గా తీసుకున్న శిల్పి ఏకంగా సబ్బును వాడి, ఆ తర్వాత అది పని చేయకపోవడంతో కోర్టుకెక్కారు.
దీంతో, 'మా సబ్బు వాడండి అందం వెతుక్కుంటూ వస్తుందం'టూ ప్రకటనలతో ఊదరగొట్టిన ఓ సంస్థ వినియోగదారుకి రూ.30,000 నష్ట పరిహారం చెల్లించింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.
మలయళం టీవీ ఛానెల్స్లో ప్రకటనలతో ఊదరగొడుతున్న ఇందులేఖ సబ్బుతో తన ఫేట్ మారుతుందని భావించిన చాతూ అనే శిల్పి వినియోగదారు ఏడాది పాటు ఆ సబ్బును వాడారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆ సబ్బు ప్రకటనలో నటించిన మోహన్ లాల్, ఆ సబ్బును తయారు చేస్తున్న సంస్థ తనను మోసం చేశాయంటూ వాయానంద్లోని వినియోగదారుల కోర్టులో 2015 సెప్టెంబర్ లో కేసు నమోదు చేశారు.
సమాజంలో ఎంతో పలుకుబడి, ప్రభావం ఉన్న మమ్ముట్టీ ప్రకటనను చూసి ఆ సబ్బును వాడానని, అయితే ఎలాంటి ఫలితం లేదని, తనకు నష్టపరిహారం అందజేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఎలాంటి ప్రతివాదనకు అవకాశం ఇవ్వకుండా పరిహారంగా రూ.30,000 రూపాయలు చెల్లిస్తామని ఇందులేఖ సబ్బు తయారీ సంస్థ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.