ఘోరం: యువతిపై 12మంది 2నెలలపాటు రేప్
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత మైనర్ బాలికపై 12మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి చిత్రహిసంలకు గురిచేశారు. ఈ దారుణాన్ని రెండు నెలలపాటు కొనసాగించారు ఆ దుర్మార్గులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏడుగురు యువకులను అరెస్ట్ చేశారు. వీరంతా 19 నుంచి 32ఏళ్ల మధ్య వయస్కులని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగితా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
నిందితుల చేతిలో చిత్రహింసలకు గురైన సదరు 15ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతోందని తెలిపారు. పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘోరం చోటు చేసుకుందని చెప్పారు.
మానసిక స్థితి సరిగా లేని తల్లి, కజిన్ బ్రదర్తో నివాసముంటున్న సదరు బాలిక.. జీవనం కొనసాగించడానికి సినిమాటిక్ డ్యాన్సర్గా పని చేస్తోంది. కాగా, కజిన్ స్నేహితులైన ఇద్దరు ప్రధాని నిందితులు ఫిబ్రవరి 2న ఆటోలో ఆమెను తీసుకెళ్లారు.
ఆమె కజిన్ను అపస్మారక స్థితిలోకి చేర్చిన నిందితులు అమీర్, అనూప్.. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తమ సెల్ ఫోన్లలో రికార్డు చేసిన వారు.. తమ కోరికను తీర్చాలని, లేదంటే ఆ వీడియోలను బయటపెడతామని హెచ్చరించారు.
ఇలా బెదిరింపులకు గురి చేసి ఆమెపై అఘాయిత్యాన్ని కొనసాగించారు. అంతేగాక, ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30 వరకు ఆమెను వివిధ ప్రాంతాలకు తిప్పుతూ.. వేర్వేరు వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని ఆమెపై అత్యాచారం చేయించారు. ఆమె ఎదురు తిరిగితే తీవ్రంగా కొట్టడంతోపాటు ఆమెను సిగరేట్లతో కాల్చారని పోలీసులు చెప్పారు.
మద్యం, గంజాయిని ఆమెకు బలవంతంగా తాగించారని చెప్పారు. మార్చి 30ను మరోసారి నిందితులు ఆమె వద్దకు వెళ్లారని, తాను రాలేనని చెప్పడంతో ఆమెపై నిందితులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. గమనించిన స్థానికులు నిందితులను నిలదీయడంతో అక్కడ్నుంచి వారు పరారయ్యారని తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాలికను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.