కేరళలో కరోనా కల్లోలం: దేశంలో సగం కేసులు అక్కడే, కేంద్రం ఆందోళన
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ కేరళ రాష్ట్రంలో మాత్రం మహమ్మారి విజృంభిస్తోంది. కేరళతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి విజృంభిస్తుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మిగితా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో కేరళ మాత్రం నిత్యం 10వేలకుపైగా కేసులు బయటపడుతున్నాయి.
కేరళ కరోనా పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదట కేరళ కరోనాను కట్టడి చేయడంలో విజయవంతమైనప్పటికీ.. రెండో వేవ్లో అంతగా సఫలం కాలేకపోయింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా ఉధృతి అదుపులోకి వస్తున్నప్పటికీ.. కేరళలో మాత్రం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
సెకండ్ వేవ్ మహారాష్ట్ర, ఢిల్లీలో కల్లోలం సృష్టించినప్పటికీ.. ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. అయితే, కేరళలో మాత్రం ఇప్పుడు కూడా 10 శాతానికిపైగా పాజిటివిటీ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో ఒక్క కేరళలోనే దాదాపు సగం కేసులు ఉండటం గమనార్మం. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22 వేల పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
ఐసీఎంఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించిన సెరో సర్వేలో దేశ వ్యాప్తంగా సరాసరిగా 67.6 శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే.. కేరళ మాత్రం 42.7 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో మరో 48 శాతం కేరళ ప్రజలకు వైరస్ ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే కేరళలో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని భావిస్తున్నారు.
కాగా కేరళలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో కరోనా ఆంక్షల సడలింపులు, పండగలు కూడా కరోనా కేసుల పెరుగుదులకు కారణంగా తెలుస్తోంది. కేరళలో అత్యధిక కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం కరోనా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని, టెస్టులు పెంచాలని సూచించింది.