కేరళ అత్యాచార ఘటన ట్విస్టు: పరస్పర అంగీకారంతోనే లైంగికంగా కలిశామన్న బాధితురాలు
తిరువనంతపురం: కేరళ అత్యాచార ఘటన మరో మలుపు తీసుకుంది. కేసులో కీలక సాక్షులుగా ఉన్న బాధితురాలు, ఆమె తల్లి కోర్టులో చర్చి ఫాదర్ రాబిన్కు అనుకూలంగా గళం విప్పారు. తనపై చర్చి ఫాదర్ అత్యాచారం చేయలేదని ఇద్దరం పరస్పర అంగీకారంతోనే లైంగికంగా కలిశామని కేసులో బాధితురాలుగా ఉన్న అమ్మాయి కోర్టుకు తెలిపింది. అమ్మాయి తల్లి కూడా ఇదే సాక్ష్యం ఇచ్చింది. అంతే కాదు తాను అప్పటికే మేజర్ని అని కోర్టుకు బాధితురాలు తెలిపింది. దీంతో కేసు మరో మలుపు తీసుకుంది.
తాను లైంగికంగా ఫాదర్ రాబిన్తో కలిసే సమయానికి మేజర్ అని చెప్పడంతో ప్రాసిక్యూషన్ షాక్ తినింది. ఫాదర్ రాబిన్ను పెళ్లి చేసుకుని తన బిడ్డతో జీవితం గడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాధితురాలు కోర్టుకు తెలిపింది. మరోవైపు రెండో సాక్ష్యంగా ఉన్న తల్లి కూడా తన స్టేట్మెంట్ను మార్చింది. ఈకేసులో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉంటూ బాధితురాలికి ఆమె కుటుంబ సభ్యులపై నిందితుడుగా ఉన్న ఫాదర్ రాబిన్ వైపు నుంచి ఒత్తిడి వచ్చి ఉంటుందని అందుకే బాధితురాలు స్టేట్మెంట్ మార్చి చెప్పి ఉంటుందని పోలీసులు చెప్పారు.
ఫిబ్రవరి 2017లో క్రైస్ట్ రాజ్ హాస్పిటల్లో బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చిందని పోలీసులు చెప్పారు. అయితే బిడ్డ మృతి చెందిందని బాధితురాలికి అక్కడి సిబ్బంది అబద్దాలు చెప్పి వాయనాడులోని ఓ అనాథ శరణాలయానికి చిన్నబిడ్డను ముగ్గురు తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మెన్ ఫాధర్ జాన్ థెరకోమ్పై ప్రభుత్వం వేటు కూడా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బిడ్డకు సంబంధించి చిన్న సమాచారం అందడంతో ఆ బిడ్డకు తల్లికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించడంతో ఆ బిడ్డ బాధితురాలి బిడ్డనే అనే నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఇదే విషయమై బాధితురాలి తండ్రిని అడిగినప్పుడు తనే తన కూతురిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. కానీ నిజానికి తానెటువంటి నేరానికి పాల్పడలేదని... తన కుటుంబానికి బెదిరింపులు వస్తుండటంతోనే ఆమె తండ్రి అలా చెప్పాడని పోలీసులు వివరించారు. అయితే తండ్రే తాను అబద్ధం చెప్పినట్లు ఒప్పుకొని ... ఈ దారుణానికి పాల్పడింది ఫాదర్ రాబిన్ అని అధికారులకు చెప్పాడు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో రాబిన్ కేసు నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గమని ఆలోచించి...బాధితురాలు అతని కుటుంబంపై తీవ్ర బెదిరింపులు ఒత్తిళ్లు తీసుకొచ్చి తను లైంగికంగా కలిసే సమయానికి బాధితురాలు మేజర్ అని చెప్పేలా వారు చేసినట్లు విచారణాధికారులు తెలిపారు. ఆనాడు ఈ కేసును ప్రస్తావిస్తూ సండే షాలోమ్ అనే పత్రిక ఆ బాధితురాలికి 15 ఏళ్లు అని ప్రచురించిందని.. మైనర్గా అభివర్ణించిందని విచారణాధికారులు గుర్తు చేశారు.