Kerala: పరిస్థితి ఇంకా ఘోరం -14.3శాతానికి పాజిటివిటీ రేటు -కొత్తగా 20,452 కేసులు,114 మరణాలు
దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా పరిస్థితి ఇంకాస్త ఘోరంగా తయారైంది. దేశంలోనే అత్యధికంగా కొనసాగుతోన్న పాజిటివిటీ రేటు ఇప్పుడు ఏకంగా 14.3 శాతానికి పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా మహమ్మారి అదుపులోకి వస్తుందని భావిస్తుండగా, కేరళలో మాత్రం వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటం కలవరపెడుతున్నది. కేరళ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసి కేంద్రం నేరుగా మంత్రినే రంగంలోకి దింపుతున్నది. వివరాలివి...
కరోనా దెబ్బకు విలవిల్లాడుతోన్న కేరళలో నిత్యం 20వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం నాడు ప్రకటించిన లెక్కలను బట్టి, గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 20,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 36,52,090కు పెరిగింది.

కేరళలో నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు 114 మంది మరణించారు. తద్వారా మొత్తం మరణాల సంఖ్య 18,394కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కేరళలో 16,856మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 34,53,174కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,80,002గా ఉంది. కాగా, కేరళలో పాజిటివిటీ రేటు అత్యధికంగా 14.35శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
గడిచిన 24 గంటల్లో లక్షా 42వేల నమూనాలను పరీక్షించగా పాజిటివిటీ రేటు 14.35శాతంగా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. మలప్పురంలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 3010 కేసులు నమోదు కాగా, కొళికోడ్లో 2426, ఎర్నాకులంలో 2388 కేసులు వెలుగు చూశాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించడంతోపాటు ట్రాకింగ్ వ్యవస్థను కూడా పకడ్బందీగా చేపడుతున్నట్లు వీణా జార్జ్ స్పష్టం చేశారు.
మరోవైపు, కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్మాండవీయ కేరళలో పర్యటించనున్నారు. ఈ నెల 16న కేరళలో, 17న అసోంలో పర్యటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను నియమించి మహమ్మారి నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక పొరుగున ఉన్న..
కేరళను ఆనుకుని ఉండే కర్ణాటకలో కొత్త కేసుల ఉధృతి తగ్గినప్పటికీ కొవిడ్ మూడో వేవ్ తలెత్తవచ్చనే ఆందోళనల నేపథ్యంలో బొమ్మై సర్కారు అప్రమత్తమైంది. ఆగస్ట్ 15 తర్వాత కర్ణాటకలో వైరస్ కట్టడికి కఠిన నియంత్రణలను అమలు చేయనుంది. రాష్ట్రంలో కొవిడ్-19 పరిస్ధితిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేశారని రెవెన్యూ మంత్రి ఆర్ .అశోక్ వెల్లడించారు. కర్నాటక ప్రభుత్వం ఆగస్ట్ 25 నుంచి స్కూల్స్ పునఃప్రారంభమవుతాయని ప్రకటించినా థర్డ్ వేవ్ తలెత్తవచ్చనే అంచనాతో సీఎం నిపుణులతో అత్యవసర భేటీని ఏర్పాటు చేయడం గమనార్హం. చిన్నారులు వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో థర్డ్ వేవ్ వారిపై ప్రభావం చూపుతుందని బొమ్మై ఇప్పటికే హెచ్చరించారు. చిన్నారులపై మహమ్మారి ప్రభావాన్ని మందింపు చేసేందుకు తాము ఉడిపి, హవేరి జిల్లాల్లో వాత్సల్య పధకాన్ని చేపట్టామని సీఎం తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపాలను నివారించేందుకు ఆయా జిల్లాల్లో పీడియాట్రిక్ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. కర్ణాటకలో ఆగస్ట్ 1 నుంచి 11 వరకూ 543 మంది చిన్నారులకు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక,
దేశ్యాప్తంగా చూసుకుంటే శుక్రవారం నాటికి కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గినా, మరణాలు మాత్రం పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం, నిన్న ఒక్కరోజే, 19,70,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 40,120 కేసులు వెలుగుచూశాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే కేసుల్లో 2.6 శాతం తగ్గుదల కనిపించింది. మరణాలు మరోసారి 500 దాటాయి. నిన్న మహమ్మారి ధాటికి 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.21 కోట్లు దాటగా.. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4,30,254 గా ఉందని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 42వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3.13 కోట్లుగా ఉంది. రికవరీ రేటు 97.46 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 1.20 శాతంగా ఉంది. ప్రస్తుతం 3,84,227 మంది కొవిడ్తో బాధపడుతున్నారు. అలాగే నిన్న 57,31,574 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 52.95 కోట్లకు చేరింది. అటు ప్రపంచ దేశాలను చూస్తే...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా వైరస్ ఉద్ధృతి మాత్రం ఆగడంలేదు. గడిచిన 24గంటల వ్యవధిలో అన్ని దేశాల్లో కలిపి దాదాపు 10వేల మందికి పైగా మృత్యువాతపడగా.. 7లక్షల మందికి ఈ మహమ్మారి సోకింది. అమెరికా, బ్రిటన్, ఇరాన్ సహా పలు దేశాల్లో ఈ వైరస్ ఉద్ధృతి ఆందోళనకరంగా మారుతోంది. ఒక్క అమెరికాలోనే నిన్న దాదాపు 1.16 లక్షల కేసులు, 614 మరణాలు నమోదు కాగా.. ఇరాన్లో 39వేలకు పైగా కేసులు, 568 మరణాలు వెలుగుచూశాయి. ఇకపోతే, బ్రిటన్లోనూ దాదాపు 33వేల మందికి కొవిడ్ సోకింది. జులై 23 తర్వాత తొలిసారి నమోదైన అత్యధిక కేసులు ఇవేనని అక్కడి వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జాన్హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,54,62,557 మందికి వైరస్ సోకగా.. 43,35,111మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 18.5కోట్ల మందికి పైగా కోలుకున్నారు.












Click it and Unblock the Notifications