థర్డ్వేవ్ సంకేతం: ఆ రాష్ట్రంలో 21 వేలకు పైగా కరోనా కొత్త కేసులు: కేంద్రం నుంచి టీమ్
తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ థర్డ్ వేవ్ తీవ్రత ఆరంభమైన పరిస్థితులు కనిపిస్తోన్నాయి. సెకెండ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న సమయంలో- వేల సంఖ్యలో నమోదైన కొత్త కేసులు పునరావృతం కానున్నాయనే సంకేతాలు అందుతోన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ- ఒకట్రెండు రాష్ట్రాల్లో ఆ మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉందనడానికి సాక్ష్యంగా నిలిచింది.. కేరళ. సెకెండ్ వేవ్ తీవ్రత ఏపీ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో నియంత్రణలోనే ఉన్నా.. కేరళలో మాత్రం చెలరేగుతూనే ఉంది. కరోనా మరణాల్లోనూ అదే తీవ్రత అక్కడ కొనసాగుతోంది.
కేరళలో 24 గంటల వ్యవఃధిలో కొత్తగా 21,119 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 152 మంది మరణించారు. 18,493 మంది ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడ్డాడు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో యాక్టివ్ కేసుల సంఖ్య 1,71,985కు చేరింది. టెస్ట్ పాజిటివిటీ రేటు 15.91గా నమోదైంది. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 18,004కు చేరింది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపించనుంది.

జిల్లాలవారీగా చూసుకుంటే.. మళప్పురంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కొత్తగా 3,603 ఎర్నాకుళం-2,539, కోజికోడ్-2,335, త్రిశూర్-2,231, పాలక్కాడ్-1,41, కొల్లం-1,637, కొట్టాయం-1,245, అళప్పుజ-1,230, కన్నూర్-1,091, తిరువనంతపురం-1,040, వాయనాడ్-723, పథనంథిట్ట-686, కాసర్గాడ్-536, ఇడుక్కి-382 కేసులు నమోదయ్యాయి. ఈ 24 గంటల వ్యవధిలో మొత్తం 1,32,769 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించింది కేరళ ప్రభుత్వం. ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం శాంపిళ్ల సంఖ్య 2,87,45,545కు చేరింది.
సెంటినెల్ శాంపిళ్లు, సీబీఎన్ఏఏటీ, ట్రూనాట్, పీఓసీటీ, పీసీఆర్, ఆర్టీల్యాంప్, యాంటీజెన్ విధానాల్లో అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తోంది పినరయి విజయన్ ప్రభుత్వం. దీనితోపాటు కరోనా తీవ్రతను అరికట్టడానికి వారాంతపు రోజుల్లో సంపూర్ణ లాక్డౌన్ను ప్రవేశ పెట్టింది. నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తోంది. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా తగ్గుతోన్నప్పటికీ- కేరళలో ఏ మాత్రం దిగిరావట్లేదు. తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కేరళకు ప్రత్యేక బృందాన్ని పంపించనుంది.
ఫలితంగా పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వం కేరళతో తన సరిహద్దులను మూసివేసింది. కేరళ నుంచి కర్ణాటకకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందనే నిబంధనను అమలు చేస్తోంది. నెగెటివ్ సర్టిఫికెట్లను అందజేయని వారిని సరిహద్దులను దాటనివ్వట్లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖను పర్యవేక్షించిన టీచర్ కేకే శైలజ అనుసరించిన వ్యూహాలు ఇప్పుడు అమలు కావట్లేదనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications